కేంద్రం మన గోడు వినిపించుకోవడం లేదు. మిలిటరీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఒకవైపు కంటోన్మెంట్లో బల్కాపూర్ నాలాపై చెక్డ్యామ్లు కట్టి నీళ్లు ఆపుతున్నారు. దీనివల్ల కాలనీ మునిగిపోతున్నది. శాతం చెరువు నుంచి గోల్కొండ కింది నుంచి ఏఎస్ఐ వరకు పర్మిషన్ తీసుకొందామంటే అక్కడే ఏఎస్ఐ అడ్డం. ఇక్కడ కంటోన్మెంట్ అడ్డం. వారిదేదో స్వతంత్ర దేశం అన్నట్టు, తెలంగాణ వేరే దేశం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు నాలాల మీద చెక్డ్యాంలు కడతామంటే ఊరుకోం. అవసరమైతే మంచినీళ్లు, కరెంటు బంద్ చేస్తం. అప్పుడైనా దిగిరారా చూస్తం.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కంటోన్మెంట్ అధికారులు ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. వారిదేదో స్వతంత్ర దేశం అన్నట్టుగా, తెలంగాణ వేరే దేశం అన్నట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో జీహెచ్ఎంసీలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఇక్కడి ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని, కానీ నాలాల మీద ఇష్టం వచ్చినట్టు చెక్డ్యామ్లు కట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. వారి వైఖరి మారకుంటే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సివస్తుందని, అవసరమైతే కంటోన్మెంట్ అధికారులకు కరెంటు, నీళ్లు బంద్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కంటోన్మెంట్తోపాటు గోల్కొండ ఏఎస్ఐ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అక్కడి అధికారులు ప్రభుత్వానికి అవరోధాలు సృష్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘గతంలో వరదలు వచ్చినప్పుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి పర్యటించాను. ఆయన నాకు అనేక సమస్యలుచెప్పారు. నేను స్వయంగా చూశాను. కానీ ఏం చేస్తం! కేంద్రం మన గోడు వినిపించుకోవడం లేదు. మిలిటరీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఒకవైపు కంటోన్మెంట్లో బల్కాపూర్ నాలాపై చెక్డ్యామ్లు కట్టి నీళ్లు అపుతున్నారు. దీనివల్ల కాలనీ మునిగిపోతున్నది. శాతం చెరువు నుంచి గోల్కొండ కింది నుంచి ఏఎస్ఐ వరకు పర్మిషన్ తీసుకొందామంటే అక్కడే ఏఎస్ఐ అడ్డం. ఇక్కడేమో కంటోన్మెంట్ అడ్డం. ఇది మంచి పద్ధతి కాదు. వారిదేదో స్వతంత్ర దేశం అన్నట్టు, తెలంగాణ వేరే దేశం అన్నట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు నాలాల మీద చెక్డ్యాంలు కడతామంటే ఊరుకోం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంటు బంద్ చేస్తం. అప్పుడైనా దిగిరారా చూస్తం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు. నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే కంటోన్మెంట్ అధికారులను పిలిచి మాట్లాడండి. ఒకవేళ వారు వినకపోతే తీవ్ర చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభలో చెప్తున్నా. ప్రజల హితాన్ని కోరే వ్యక్తులం మేం. పైసా సహాయం చేయరు. కానీ, పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కల్పిస్తున్నారు. ఇది మంచిది కాదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అరపైసా కూడా సాయం చేయలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘మేం పెట్టకపోతే హైదరాబాద్లో, తెలంగాణలో మీకు బువ్వ కూడా లేదు, మేమే ఇస్తున్నం, మేమే అన్నీ చేస్తున్నమన్నట్టు కేంద్రప్రభుత్వ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)లో రూ.1,000 కోట్లతో చేపట్టిన పనుల్లో కేంద్రం వాటా సున్నా. 2020, అక్టోబర్లో వరదలు వచ్చి మూసీ పొంగింది. చాలా కాలనీలు నీట మునిగాయి. అందరం తిరిగి చూసినం. కేంద్రం నుంచి కూడా కొందరు పెద్దపెద్ద మంత్రులు వచ్చారు. వాళ్లేమైనా పైసలు తీసుకొస్తరేమో, సహాయం చేస్తరేమో అనుకొన్నం. కానీ వచ్చి ఫొటోలు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అది చేయాలి.. ఇది చేయాలి అని డిమాండ్చేశారు. ఇప్పటికి 18 నెలలు దాటింది, అరపైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వరదసహాయం రాలేదు. ఈ విషయాన్ని బాధతో, సిగ్గుతో చెప్తున్నా. గుజరాత్లో వరదలు వస్తే ప్రధాని వెళ్లి రూ.1,000 కోట్లు ఇచ్చి వచ్చారు. హైదరాబాద్ వరద బాధితుల కోసం అరపైసా ఇవ్వలేదు. ఇదే నగరంనుంచి కేంద్ర క్యాబినెట్లో మంత్రి కూడా ఉన్నారు. దురదృష్టం.. హైదరాబాద్ ప్రజలకు సహాయం చేయాలని ఆయనకు కూడా మనసు రావడంలేదు. హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఎన్డీపీకి సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తే, అమృత్-2 ప్రోగ్రాంలోకి తీసుకొంటాం.. దాంట్లో లక్ష పైచిలుకు జనాభా ఉన్న ఏ నగరమైనా చేరొచ్చు.. మీ హైదరాబాద్ను కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. లక్షల పైచిలుకు జనాభా ఉన్న నగరాలు ఎక్కడుంటయ్? హైదరాబాద్ కోటి పైచిలుకు జనాభా ఉన్న నగరం, దీన్ని కూడా మీరు అమృత్లో తీసుకోండి. మేమిచ్చే అమృతం తాగండి.. దాంతోనే మొత్తం కట్టేయండి అంటే.. వాళ్లు ఇచ్చే వంద కోట్లో రెండొందల కోట్లో హైదరాబాద్లో నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావు. కేంద్ర ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు, బాధాకరం, శోచనీయం’ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.