దావోస్: అమెరికా నేతృత్వంలో ప్రపంచం పరివర్తనవైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నదని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. ఆయన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో బుధవారం మాట్లాడుతూ, “మనం ఇప్పుడు విచ్ఛిన్నం దశలో ఉన్నాం, పరివర్తన దశలో కాదు” అని చెప్పారు. నియమ, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిపారు. దాని స్థానంలో బలవంతుడు తనకు నచ్చిన పని చేయగలిగే పరిస్థితులు, బలహీనులు అనుభవించగలిగిన బాధను అనుభవించే దుస్థితికి వచ్చాయన్నారు. బెదిరించేందుకు టారిఫ్లు, సప్లయ్ చైన్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్ను ఉపయోగిస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఆర్థిక ఏకీకరణను బెదిరింపుగా ఉపయోగించుకుంటూ తమ ప్రయోజనాలను అత్యంత శక్తివంతులు సాధించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, మధ్య స్థాయి దేశాలు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.