న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డివిరుస్తున్నది. ధరల పెంపునకు అంతర్జాతీయ పరిస్థితులు, అదీఇదీ అంటూ కేంద్ర పెద్దలు సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ కూడా చేరారు. ఢిల్లీ-గువాహటి విమానంలో తారసపడిన స్మతి ఇరానీని కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా ఎల్పీజీ ధరల పెంపుపై ప్రశ్నించారు. ఇరానీ స్పందిస్తూ ‘కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నది. 183 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు కూడా ఉచితంగా పంపిణీ చేశాం’ అని విచిత్రమైన వాదన చేశారు. ఆమె సమాధానాన్ని వీడియో తీసిన నెట్టా డిసౌజా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ధరలు పెరగడం వల్ల ‘గ్యాస్ లేని స్టవ్స్’ ఇండ్లలో ఉన్నాయని డిసౌజా ప్రశ్నించగా, ‘అబద్ధాలు చెప్పకండి’ అంటూ కేంద్ర మంత్రి అనడం అందులో ఉన్నది.