లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. హర్యాణా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు బిహార్ వెళ్తోంది. ఈ క్రమంలో బారాబంకి రామ్ స్నేహి ఘాట్ కొత్వాలి ప్రాంతంలోని లక్నో – అయోధ్య జాతీయ రహదారిపై బస్సు ఆగి ఉండగా.. లక్నో వైపు నుంచి వస్తున్న ట్రక్కు వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ వారిని దగ్గరలో ఉన్న లక్నో ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దాదాపు రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. సంఘటన అనంతరం హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. క్షతగాత్రుల రోధనలు మిన్నంటగా.. ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో భయానకంగా మారింది. మృతులంతా బిహార్ వాసులుగా తెలుస్తోంది. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ యమూనా ప్రసాద్ తెలిపారు.