న్యూఢిల్లీ, నవంబర్ 27: ఉద్యోగుల పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణపై నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వాలపైన పెను భారం పడుతుందని, ఇది పన్ను చెల్లింపుదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని రాష్ర్టాలు కొత్త పెన్షన్ పథకం నుంచి పాత పెన్షన్ విధానానికి మారాలని నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వృద్ధిరేటు సాధించాల్సిన ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారుతాయని అభిప్రాయపడ్డారు. పాత పెన్షన్ విధానంలో పింఛన్ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించేది.
2004 అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్ పథకాన్ని (ఎన్పీఎస్) అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్పీఎస్లో భాగంగా ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ నుంచి 10 శాతం పింఛను కింద జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తమవంతుగా 14 శాతం జమచేస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాయి. హిమాచల్ప్రదేశ్లో తాము గెలిస్తే ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని అధికార బీజేపీ హామీ ఇచ్చింది. జార్ఖండ్, పంజాబ్ కూడా ఓపీఎస్కు మారాలని నిర్ణయించాయి. కాగా, రాష్ర్టాలన్నీ తమ నిర్ణయాలను అమలుచేస్తే ప్రస్తుతానికి ప్రభుత్వాలు లాభపడినా, భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదని సుమన్ బేరీ హెచ్చరించారు. ఓపీఎస్ వల్ల ఎదురయ్యే పరిణామాలను పౌరులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.