గజ్వేల్, మే 13: ఎంపీ బండి సంజయ్.. తొండిమాటలు కట్టిపెట్టు.. దమ్ముంటే సిద్దిపేట జిల్లాకు వచ్చి చూడు.. ఇక్కడి అభివృద్ధి ఏమిటో తెలుస్తదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, మర్కూక్, వర్గల్ మండల కేంద్రాల్లో సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు ఒక్క ఎకరాకు కూడా పారలేదా? దమ్ముంటే సిద్దిపేట జిల్లాకు వచ్చి చూడాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే లక్షల ఎకరాలకు సాగునీరు అంది, ఎండాకాలంలోనూ రైతులు అధిక దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాకముందు 99 లక్షల టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడు 2.59 కోట్ల టన్నుల ధాన్యం పండిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి గీతారెడ్డి, గత ఎమ్మెల్యేలు సంజీవరావు, విజయరామారావు, నర్సారెడ్డిలు గజ్వేల్ను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.
కార్పొరేట్ను తలదన్నేలా సర్కారు బడులను అభివృద్ధి చేస్తామని, రానున్న రోజుల్లో సర్కారు బడుల ముందు నో అడ్మిషన్ బోర్డులుంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పామాయిల్ సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు సబ్సిడీ పెట్టారని, రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్రావు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.