జోధ్పూర్: భారత్, పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రిటైర్డు లాన్స్ నాయక్ భైరాన్సింగ్ రాథోడ్ సోమవారం రాజస్థాన్లోని జోధ్పూర్లో 81వ ఏట కన్నుమూశారు. లోంగేవాలా సెక్టార్లో జరిగిన పోరులో ఆయన చూపిన ధైర్యసాహసలాకు గానూ సేనా మెడల్ అందుకున్న రాథోడ్ స్థానిక ఎయిమ్స్ దవాఖానలో అంతిమశ్వాస విడిచారు. ఆయనను అందరూ అభిమానంగా లోంగేవాలా హీరో అని పిలుస్తారు. ఆనాటి పోరుపై తీసిన బాలీవుడ్ చిత్రం ‘బార్డర్’లో సునీల్ షెట్టీ ఆయన పాత్రను పోషించారు. రాథోడ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు. రాథోడ్ నేతృత్వంలోని బీఎస్ఎఫ్ జవాన్ల బృందం పంజాబ్ రెజిమెంట్తో కలిసి పాక్ బ్రిగేడ్ను, ట్యాంక్ దళాన్ని ధ్వంసం చేయడం గురించి కథలుకథలుగా చెప్పుకొంటారు. త్రివర్ణ పతాకంతో కప్పిన ఆయన భౌతిక కాయాన్ని బీఎస్ఎఫ్ స్థానిక కార్యాలయంలో సందర్శనార్థం ఉంచారు. ఆయన స్వగ్రామం సోలంకియాతాలాలో సైనిక లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.