హైదరాబాద్ : ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేల మంది ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు.
నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వేల మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో అదుపులోకి తీసుకొని బంధించి ఉంచడం దుర్మార్గమైన చర్యగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటనను, ఆటో అన్నలు కోరినట్లుగానే ఈరోజే అసెంబ్లీలో ప్రభుత్వం చేయాలని ఆయన కోరారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టంచేశారు.