పెద్దపల్లి కమాన్, జూలై 29: తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలకు రేవంత్ సర్కార్ తలవంచిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకమే ఇప్పుడు ఆదుకుంటున్నదని, దీంతోనే రాష్ట్ర ప్రజలకు మేలవుతున్నదని స్పష్టం చేశారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత్య కీలకమైన నందిమేడారం, గాయత్రీ పంపుహౌస్ మోటర్లను అధికారులు ఆన్చేసి, నీటిని ఎత్తిపోస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగులోని గాయత్రీ పంపుహౌస్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి దాసరి మనోహర్రెడ్డి పరిశీలించి, మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయిదంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలోని పంటలకు ప్రాణం పోసిందని కొనియాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నాయకత్వంలో చేసిన ఆందోళనకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చి నీటిని ఎత్తిపోస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు కళ్లు తెరవాలని హితవు పలికారు. కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లు ఆన్ చేసి సాగుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, మాజీ కౌన్సిలర్లు పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, సోషల్ మీడియా ఇన్చార్జి ఖాదర్, తదితరులు ఉన్నారు.