KCR | నిజామాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్ వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిజామాబాద్లో పోయినసారి బీజేపీ ఎంపీని గెలిపించారు. ఏమన్న లాభం జరిగిందా..? ఏకాణా పని కూడా కాలేదు కదా..? నేను సీఎం అయినప్పుడు మోదీ ప్రధాని అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే ముందు ప్రధాని అయిన తర్వాత ఒక వంద యాభై నినాదాలు చెప్పారు. ఒక్కటన్న నిజమైందా..? సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అయిందా..? కాలేదు కానీ దేశ్ కా సత్య నాశ్ అయింది. మేకిన్ ఇండియాలో, డిజిటల్ ఇండియాలో ఏమైనా వవచ్చిందా..? బేటీ బచావో బేటీ పడావో అన్నారు. కానీ దేశంలో మహిళల మీద అత్యాచారాలే. బాలికలకు రక్షణకు లేకుండా పోయింది. అచ్చేదిన్ వచ్చిందా..? రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. పెట్రోల్, డిజీల్ ధరలు పెరిగాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. కానీ రెట్టింపు కాలేదు. వికసిత్ భారత్ అయిందా..? జన్ ధన్ యోజన్ వల్ల ఏమన్నా లాభం అయిందా..? మీకు నిజామాబాద్ వాళ్లకు పైసలు వచ్చాయని తెలిసింది. నిజమేనా..? నేను ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తా అని మోదీ అన్నాడు. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నందుకు 30 లక్షలు, 15 లక్షలు వచ్చాయా..? పదిహేను లేదు పాస్ లేదు అంత వట్టిదే గ్యాస్ అని కేసీఆర్ మండిపడ్డారు.
మోదీ గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తా అంటున్నాడు. యుద్ధం చేద్దామా..? మన గోదావరి మనకే ఉండాలి. ఆ నది మీద నీళ్ల హక్కు మనకు ఉండాలి. ఆ హక్కు కావాలంటే నిజామాబాద్ పులి బిడ్డ బాజిరెడ్డి గెలవాలి. ఈ గ్యాస్ గాళ్లు గెలిస్తే.. ఉన్న గోదావరి ఊసిపోతది. గులాబీ జెండా ఎత్తిన నాడు నా వెంట నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉండి జడ్పీ స్థానాన్ని గెలిపించారు. కేసీఆర్ చనిపోయే వరకు నా గుండెలోల్లో నిజామాబాద్ ఉంటది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది కూడా ఈ గడ్డనే. నేను మీ బిడ్డగా చెప్తున్నా.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ దగ్గర చేతుల కట్టుకుంటారు. మన హక్కుల కోసం నోరు మెదపరు అని కేసీఆర్ దుయ్యబట్టారు.
ప్రతి జిల్లాకు నవోదయ ఇవ్వాలని 150 ఉత్తరాలు రాస్తే ఒక్క నవదోయ కూడా ఇవ్వలేదు. ఒక్క పాఠశాల ఇవ్వని మోదీకి ఎందుకు ఓటు వేయాలి. మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి. బీజేపీ వాళ్లు గెలిస్తే ఏం రాదు.. ఒకసారి ఆలోచించాలి. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా. కాంగ్రెస్, టీడీపీ హయాంలో పూర్తిగా ఎండబెట్టారు. నిజాం సాగర్ను మునగొట్టారు. గుత్ప- అలీసాగర్ ప్రాజెక్టు రాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాం సాగర్ను మల్లన్న్ సాగర్కు లింక్ చేసుకున్నాం. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. శ్రీరాం సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాల్వను రిజర్వాయర్గా చేసుకున్నాం. ఈ ముఖ్యమంత్రి వచ్చాక వరద కాల్వను నాశనం చేశారు. కరెంట్ కోతలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ బ్రహ్మాండగా ఇస్తున్నామని అంటున్నారు. అదంతా తప్పు అని కేసీఆర్ మండిపడ్డారు.
గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. కల్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా..? వడ్లు కొనడం లేదు. 500 బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. పాత ధర కూడా ఇవ్వడం లేదు. తడిసిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మేం ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇచ్చాం. అది కూడా బంద్ పెట్టారు. కేసీఆర్ కిట్, సీఎంఆర్ఎఫ్ బంద్ పెట్టారు. నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడంలేదు. నేతన్నల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వస్తుంది. ఐదు నెలల్లోనే ఎందుకు మారిపోయింది.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.