KCR : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఆనాడు గిరిజన బిడ్డలకు పరిపాలన చేరువకావాలని కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు రేవంత్రెడ్డి జిల్లా తీసేస్తమంటున్నడని అన్నారు. కొత్తగూడెం జిల్లా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకుపెట్టాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటైన జిల్లా. మారుమూల ప్రాంతాలకు పరిపాలన చేరువ కావాలని, గిరిజన బిడ్డలందరికి న్యాయం జరగాలని కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నం. ఇంజినీరింగ్ కాలేజీ పెట్టుకున్నం. పట్టణాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నం. మీ అందరికి చరిత్ర తెలుసు. చాలా దూరంలో ఉండే చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాల వాళ్లు ఖమ్మం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కాబట్టి కావాలనే మనం ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసుకున్నం’ అని కేసీఆర్ చెప్పారు.
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొత్తగూడెం జిల్లాను తీసేస్తం అంటున్నడు. కొత్తగూడెం జిల్లా ఉండాల్నా.. తీసేయాల్నా..?’ అని కేసీఆర్ ఓటర్లను ప్రశ్నించారు. ‘కొత్తగూడెం జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగేశ్వర్రావు, కవిత గెలువాలె. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకుపెట్టాలె. అరచేతిలో వైకుంఠం చూపించి, అడ్డోగులు వాగ్ధానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి తెలుసు ఎలాంటి వాగ్ధానాలు చేసిండ్రో’ అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని ప్రస్తావిస్తూ ఆ వాగ్ధానం నెరవేరిందా అని ప్రజలను అడిగారు కేసీఆర్. ‘కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా మేం రూ.15 వేలు ఇస్తం అన్నరు. మరె రూ.15 వేల రైతుబంధు వచ్చిందా ఎవరికన్నా..? కేసీఆర్ కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలే ఇస్తున్నడు మేం ఆ లక్షతోపాటు తులం బంగారం ఇస్తం అన్నరు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా..? ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తం అన్నరు. ఇచ్చిండ్రా ఎవరికన్నా..? కేసీఆర్ కేవలం లక్ష రూపాయలే రుణ మాఫీ చేసిండు, మేం రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తం అన్నరు. ఎవరికన్నా రూ.2 లక్షల రుణం మాఫీ అయ్యిందా..? మరె ఏమయ్యింది కాంగ్రెస్ పాలనలో..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.