కట్టంగూర్, జూన్ 24 :కట్టంగూర్లోని పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో అంబేద్కర్నగర్, అంబటివాగు అవాస గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు కొన్నేండ్లుగా నానా అవస్థలు పడేవారు. అయితే హైస్కూల్, గ్రామపంచాయతీ సమీపంలో పెద్దవాగుపై రెండు కల్వర్టులు ఉండేవి. భారీ వర్షాలకు వరద ఉధృతికి వాగుపై ఉన్న కల్వర్టులు కొట్టుకుపోవడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడి ప్రజలు, వాహనదారులు చుట్టూ తిరిగి జాతీయ రహదారిపై ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
కాలనీ వాసులు వాగుపై వంతెన నిర్మాణాలు చేపట్టాలని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. వాగుపై వంతెన నిర్మాణాలు చేసట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూ రు చేయాలని సీఎంకు విన్నవించారు. స్పందించిన సీఎం కేసీఆర్ రెండు హైలెవల్ వంతెనల నిర్మాణ కోసం ఎస్డీఎఫ్ నిధులు రూ.4 కోట్లు మంజూరు చేశారు. వాగుపై వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజల కష్టాలు తీరడంతో పాటు ప్రయాణ సులభతరం కానుంది. ఏళ్ల కల నెరవేరనుండడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే చిరుమర్తి చొరవతో తీరనున్న కష్టాలు
పెద్దవాగుపై వంతున లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడేవారు. వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలే నిలిచిపోయాయి. అంబేద్కర్నగర్, అంబటివాగు ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవ తీసుకొని మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.4 కోట్లు మంజూరు చేయించారు. వంతెన నిర్మాణాలు పూర్తయితే ప్రజలు, వాహనదారులు కష్టాలు తీరనున్నాయి. దృష్టికి తీసుకెళ్లాం. ఏళ్ల కాలంగా ఉన్న సమస్యలను తీర్చిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రుణపడి ఉంటాం.
– జడ్పీటీసీ తరాల బలరాములు
ప్రజల కష్టాలు తీర్చడమే తన లక్ష్యం
నియోజవర్గ ప్రజల కష్టాలు తీర్చడమే తన ముందున్న లక్ష్యం. మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెద్దవాగుపై వంతెనలు నిర్మించాల్సి ఉండేది. ఆనాటి సమైక్య పాలకుల కారణంగా అప్పుడు సాధ్యం కాలేదు. మంత్రి జగదీశ్రెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కలిసి కోరగా వెంటనే రెండు హైలెవల్ వంతెన నిర్మాణాలకు రూ.4 కోట్లు మంజూరు చేశారు. రెండు వంతెన నిర్మాణాలతో ప్రజలు కష్టాలు తీరునున్నాయి. త్వరలో పనులను ప్రారంభిస్తాం. అడిగిన వెంటనే మన్నించి వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
-ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య