న్యూఢిల్లీ, నవంబర్ 17: లంచం ఇవ్వకుంటే పని జరగని దేశాల్లో భారతదేశం పరిస్థితి గతేడాదితో పోల్చితే మరింత దిగజారింది. లంచం సూచీ(బ్రైబరీ ఇండెక్స్)లో ఇండియా 77వ ర్యాంకు నుంచి 82వ స్థానానికి పడిపోయింది. లంచ వ్యతిరేక ప్రమాణాల రూపకల్పన సంస్థ అయిన ట్రేస్ ప్రపంచంలోని 194 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ప్రతీ ఏడు ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఒక దేశంలో కంపెనీలకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వడం, అవినీతి నిరోధక విభాగం పనితీరు, కంపెనీలకు అనుమతుల్లో పారదర్శకత, లంచంపై పౌర నిఘా, మీడియా పాత్ర అనే నాలుగు అంశాల ఆధారంగా ట్రేస్ ఈ నివేదికను తయారు చేస్తుంది. లంచం సమస్య అత్యంత ఎక్కువ ఉన్న దేశంగా ఉత్తర కొరియా (194 ర్యాంకు) ఉండగా.. అతి తక్కువ ఉన్న దేశంగా డెన్మార్క్ (మొదటి ర్యాంకు) నిలిచింది. గడిచిన దశాబ్దంలో ముఖ్యంగా అమెరికాలో బిజినెస్ బ్రైబరీ(కంపెనీల అనుమతులకు లంచం) బాగా పెరిగిందని ట్రేస్ పేర్కొన్నది.