న్యూఢిల్లీ, జనవరి 23: దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన ప్రభావం వచ్చేవారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై గట్టిగా పడుతుందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. పన్నుల ఆదాయం సన్నగిల్లడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యయపర్చే సామర్థ్యం తగ్గిపోయిందని, దీంతో మూలధన పెట్టుబడుల కేటాయింపుల్లో వృద్ధి శాతం గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోతుందని రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఆహార, ఎరువుల సబ్సిడీల్లో భారీగా కోత విధిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. తయారీ రంగానికి హబ్గా భారత్కు వ్యాపార వేత్తలను ఆకర్షించేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం మూలధన పెట్టుబడుల్ని/మూలధన వ్యయాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడీ పెట్టుబడుల వృద్ధి జోరుకు కళ్లెం వేయకతప్పదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్లో మూలధన వ్యయ కేటాయింపుల్ని అంతక్రితం ఏడాదికంటే 35 శాతం పెంచగా, వచ్చే 2023-24 బడ్జెట్లో ఈ పెంపుదల 17 శాతానికే పరిమితమవుతుందని వారు అంచనా వేశారు. 2022-23లో రూ.7.50 లక్షల కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులు 2023-24లో రూ.8.85 లక్షల కోట్లకు మాత్రమే వృద్ధిచెందవచ్చని వారి అంచనా. జనవరి 13-20 తేదీల మధ్యలో రాయిటర్స్ నిర్వహించే సర్వేలో 39 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు.
రూ.3.7 లక్షల కోట్లకు సబ్సిడీలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆహార, ఎరువుల సబ్సిడీలకు కేటాయింపుల్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఈ సబ్సిడీల్లో 26 శాతం కోత విధించవచ్చని వారు చెపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీలకు రూ.5 లక్షల కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3.7 లక్షల కోట్లకు పరిమితవుతాయని అంచనా
వేశారు. ఆకలి సూచీలో అట్టడుగున ఉన్న బారత్లో సబ్సిడీల తగ్గింపుతో కోట్లాది మంది ప్రజల జీవనం ప్రమాదంలో పడుతుందని సర్వేలో పాల్గొన్న కొంతమంది ఆర్థిక వేత్తలు హెచ్చరించారు.
దిగజారుతున్న పెట్టుబడుల వాటా
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ జీడీపీలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల వాటా పడిపోతున్నదని రాయిటర్స్ కథనంలో పేర్కొంది. దేశీ పెట్టుబడుల్ని సూచించే స్థూల స్థిర పెట్టుబడుల కల్పన 2014 నుంచి వార్షికంగా చక్రగతిన 8 శాతం మాత్రమే వృద్ధిచెందగా, ఇది గత యూపీఏ ప్రభుత్వం పదేండ్ల పాలనలో 14 శాతం మేర ఉంది. జీడీపీలో పెట్టుబడుల రేషియో 2007-08లో రికార్డు గరిష్ఠస్థాయి 36 శాతం కాగా, 2021-22లో 29 శాతానికి పడిపోయింది. ప్రైవేటు రంగం పెట్టుబడులు ఇప్పుడు కాస్త పుంజుకుంటున్నట్టు కన్పిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మాంద్యం దీనిని దెబ్బతీయవచ్చని సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. 2022-23లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నమోదుకావొచ్చని, 2023-24లో ఇది 6 శాతానికి మందగించవచ్చని అంచనా.