యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయ బద్ధంగా సాగుతున్నాయి. రెండోరోజు శనివారం ఉదయం ఉత్సవాల్లో కీలకమైన ధ్వజా రోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్నిదేవుడికి ఆరాధన, హవనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన యాదాద్రి లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణ మహోత్సవానికి సకల దేవతలకు గరుత్మంతుడి ద్వారా ఆహ్వానం పంపారు. బాలాలయం మండపం ఎదురుగా పట్టువస్ర్తాలు, వజ్రవైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి వేదమంత్రాలతో అర్చించారు. శ్వేత ధ్వజ పతాకంపై గరుత్మంతుడి పటాన్ని చిత్రీకరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. గరుడ ముద్దలను పైకి ఎగురవేశారు. గరుఢ ముద్దను స్వీకరిస్తే సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉండడంతో అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న అలంకార సేవలకు యాదాద్రీశుడు ముస్తాబుకానున్నాడు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, స్వయంభూ పంచనారసింహుడిగా కొలువుదీరిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య బాలాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం గరుఢ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజ పూజ, రాత్రి సకల దేవతలకు ఇష్టమైన మేళతాళాలకు భేరీ పూజ, దేవతాహ్వానం, అగ్ని దేవుడికి ఆరాధన, హవనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నుంచి అలంకార సేవలకు యాదాద్రీశుడు ముస్తాబు కానున్నాడు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యబాలాలయంలో వార్షిక, నవాణ్ణిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా చేపట్టారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలందరినీ ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేయడమే ఈ ఉత్సవంలోని పరమార్థమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. అంతటి ప్రధాన ఘట్టానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణీకులు, యాజ్ఞికబృందం శ్రీకారం చుట్టింది. శనివారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ ఘట్టానికి ముందు బాలాలయంలోని యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు చేశారు. ప్రత్యేకంగా గరుఢ అధివాసం, గరుఢ హోమ కార్యక్రమాలు నిర్వహించి, పూర్ణాహుతి పాంచరాత్రాగమశాస్త్రరీతిలో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ధ్వజారోహణం అనంతరం అష్టదిక్పాలక బలిహరణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణం వేడుకలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీ మహావిష్ణువు ఇష్టమైన వాహనం గరుత్మంతుడిని కొలుస్తూ జరిపే తంతు ధ్వజారోహణమని అర్చకులు వివరించారు. బాలాలయం మండపం ఎదురుగా గరుఢాళ్వార్ల చిత్రపటం వద్ద పట్టు వస్ర్తాలు, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామి, అమ్మవార్లను వేదికపై అధిష్టింపజేసి వేదమంత్రాలతో దేవతలను అర్చించారు. గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రీకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుఢ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహన చేసే పర్వాలు నిర్వహించారు. గరుత్మంతుడు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన గరుఢ మద్దలను పైకి ఎగురవేసి పూజలు చేశారు. ఈ గరుఢ మద్దలు స్వీకరిస్తే సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు పోటీపడి అందుకున్నారు. అనంతరం స్వామివారికి నివేదన, తీర్థప్రసాదాల గోష్టి కార్యక్రమం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది ధ్వజారోహణం. ధ్వజం అనగా కదిలేని అని అర్థం. ధ్వజాన్ని స్తంభానికి కట్టుట వలన దానికి ధ్వజస్తంభం అనే పేరు సార్థకమైందని ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. బ్రహ్మాండ పురాణంలో ఈ వేడుక ప్రత్యేకతను తెలుపుతూ మొదట ధ్వజ దండాన్ని పూజించి అనంతరం తెల్లని వస్త్రంపై గరుత్మంతుడిని చిత్రించి 27 విధములైన ఉపచారములతో ఆరాధన గావించి చతుర్వేదములతో దేవతలను ఆవాహన చేస్తారని తెలిపారు. వివిధ ప్రక్రియలలో విశేషమైన పూజలతో గురుఢధ్యానం గావించి ముద్దల ప్రసాదం నివేదన చేసి, సంతానం కోరువారు ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతానవంతులు అవుతారని పేర్కొన్నారు. ఎన్నో విశేషమైన ఫలితాలు ఈ వేడుకలో చూడవచ్చని తెలిపారు.
బాలాలయంలో నిత్యారాధనల అనంతరం దేవతాహ్వానం, సాయంత్రం హోమం నిర్వహించారు. చతుస్థానార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. సభాస్థానంలో స్వామివారిని పెండ్లి కొడుకును చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలను 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో ఆహ్వానించారు. దేవతలందరికీ స్వామి వారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, స్వామివారి ద్వారా నైవేద్య కైంకర్యాలను అర్చకులు అర్పించారు. 33 కోట్ల దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవం పూర్తయ్యే వరకు స్వామివారికి నమస్కరిస్తూ ఉంటారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు అనుగ్రహించాలని భగవానుడిని వేడుకుంటూ ఈ పర్వాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంత శేషం ప్రణీత్ కుమారాచార్యులు, యాజ్ఞీక సిబ్బంది, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీధరాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారులు గజవెల్లి రమేశ్బాబు, గుట్టు శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు శనివారం రాత్రి భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. భేరీతాండవం మంత్రపూర్వకంగా జరిపించారు. ఈ ధ్వని విని దుష్ట శక్తులన్నీ దూరంగా పారిపోతాయి. ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగాలని భగవదారాధనతో వివిధ రాగ, తాళాలతో అనేకమైన స్తోత్ర పఠనములతో అత్యంత భక్తి భరితంగా ఈ వేడుకను నిర్వహించారు. శబ్దబ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్యం భేరీని మోగించి కంకణధారణ చేయడం ఈ ఉత్సవ ప్రత్యేకత అని అలయ అర్చకులు వివరించారు.
బాలాలయంలో నిత్యారాధనల అనంతరం యంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించారు.
కొండకింద నృసింహ సదనం వద్ద భువనగిరి పట్టణానికి చెందిన ఇందిరా నర్సింగ్ హోం ఆధ్వర్యంలో జనరల్, స్త్రీ సంబంధ వ్యాధి చికిత్స, హైదరాబాద్లోని బాలానగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించి 250 మంది భక్తులకు మందులు ఉచితంగా అందించారు.