లక్నో: ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న బ్రాహ్మణులు ప్రస్తుతం సమాజ్వాదీపార్టీవైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నది. ఇదివరకు బీఎస్పీ, బీజేపీకి అండగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణ వర్గం.. ఇప్పుడు ఎస్పీవైపు మళ్లుతున్నది. ఆ పార్టీ కీలక నేతలు ఎస్పీలో చేరుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతూరు గోరఖ్పూర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు ఎస్పీలో చేరారు. వీరిద్దరు కూడా బ్రాహ్మణులే. తాజాగా బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తండ్రి రాకేశ్ పాండే (ఈయన మాజీ ఎంపీ), మాజీ ఎమ్మెల్యే బ్రిజేశ్ మిశ్రా కూడా సమాజ్వాదీ పార్టీలో చేరారు. పూర్వాంచల్ రీజియన్లో అత్యంత శక్తివంతమైన బ్రాహ్మణ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యే పండిట్ హరి శంకర్ తివారీ, ఆయన ఇద్దరు కుమారులు కూడా ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే గోరఖ్పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఖలీలాబాద్ ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే తన అనుచర గణంతో కలిసి ఎస్పీ గూటికి చేరారు. వీళ్లే కాకుండా కుర్మి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నేత, బీజేపీ ఎమ్మెల్యే మాధురి వర్మ కూడా ఎస్పీ కండువా కప్పుకున్నారు.
అఖిలేశ్ సన్నిహితుడి ఆఫీసుల్లో సోదాలు
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సన్నిహితుడు, ఏస్ గ్రూప్ సీఎండీ, బిల్డర్ అజయ్ చౌదరి కార్యాలయాల్లో తాజాగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అజయ్ చౌదరి దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్కు సోదాల్లో గుర్తించిన పత్రాలకు పొంతన లేదని అధికార వర్గాల పేర్కొన్నాయి. సోదాలపై ఐటీ అధికారులు ఏ ప్రకటనా చేయలేదు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా సోదాలు జరుపుతూ మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఎస్పీ విమర్శించింది.
మోదీ ర్యాలీలో నల్లజెండా చూపిన మహిళపై కాల్పులు
సుల్తాన్పూర్: గతేడాది నవంబర్ 16న ప్రధాని మోదీ సుల్తాన్పూర్లో నిర్వహించిన ర్యాలీలో నల్ల జెండా ప్రదర్శించిన కాంగ్రెస్ నేత రీటా యాదవ్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం కారులో లక్నో-వారణాసి హైవేపై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపారు. కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో గాయా లపాలైన రీటా ప్రస్తుతం దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు.