మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ భవనాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించినట్లు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సంకేపల్లి సుధాకర్శర్మ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో 31న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న బ్రాహ్మణ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా సుధాకర్శర్మ మాట్లాడుతూ పదెకరాల స్థలంలో బ్రాహ్మణ సదన్ను నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల కోసం కాటేజీలు, వివాహలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చన్నారు. బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవానికి ద్వాదశ జ్యోతిర్లీంగా ప్రధాన అర్చకులను ఆహ్వానించామన్నారు. 146 నదీ జలాలను బ్రాహ్మణ భవన్ సంప్రోక్షణ కోసం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు సంకేపల్లి సుధాకర్శర్మ తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్, అచ్యుత రామశర్మ, శ్రీనివాస్, సుబ్బారావు, వనజ, ఉజ్వల, వెంకటలక్ష్మి, రాజేశ్వర్రావు, ఫణి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.