ముంబై, ఏప్రిల్ 13: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)..రూ.200 కోట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల సంస్థ చెన్నై-త్రిచి-మధురై జాతీయ రహదారిపై తొలి ఈవీ చార్జింగ్ కారిడార్ను ప్రారంభించిన సంస్థ..రెండో కారిడార్ను కొచి-సేలం రూట్లో వచ్చే రెండు నెలలో ప్రారంభించనున్నట్లు బీపీసీఎల్ ఈడీ బీఎస్ రవి తెలిపారు. ఈ చార్జింగ్ స్టేషన్లలో రెస్ట్ రూమ్స్, రిఫ్రెష్మెంట్/ఫుడ్ కోర్ట్, ఇతర సదుపాయాల కోసం రూ.7-12 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తంగా ఒక్కో యూనిట్ నెలకొల్పడానికి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 100 కారిడార్లలో 2 వేల ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి గరిష్ఠంగా రూ.200 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 7 వేల ఫాస్ట్ ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ఎంతమేర పెట్టుబడి పెడుతున్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.