లండన్ : ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత హిలరీ మాంటెల్ (70) మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను హిలరీ దక్కించుకున్నారు. ఈ రెండు పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి.
ఈ సిరీస్లో చివరిదైన ది మిర్రర్ అండ్ ది లైట్ మార్చి 2020లో ప్రచురితమైంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య హిలరీ మాంటెల్ గురువారం తుదిశ్వాస విడిచారని పబ్లిషింగ్ కంపెనీ హాపర్కాలిన్స్ ప్రకటించింది. ప్రపంచ పాఠకులపై చెరగని ముద్ర వేసి, వాస్తవ దృక్పధంతో కూడిన రచయిత్రి హిలరీ మాంటెల్ మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని హాపర్కాలిన్స్కు చెందిన ప్రచురణ సంస్ధ ఫోర్త్ ఎస్టేట్ బుక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, షెఫీల్డ్ యూనివర్సిటీలో లా చదివిన మాంటెల్ తొలుత సోషల్ వర్కర్గా సేవలందించారు. బోత్స్వానాలో తన భర్త గెరాల్డ్ మెక్వెన్తో నివసించే సమయంలో ఆమె ఫిక్షన్ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. మాంటెల్ ఆపై సౌదీ అరేబియాలో నాలుగేండ్లు ఉన్న తర్వాత 1980 ప్రాంతాల్లో తిరిగి బ్రిటన్ చేరుకున్నారు. 1985లో ఆమె తొలి నవల ఎవిరిడే ఈజ్ మదర్స్డే ప్రచురితమవగా, మొత్తం 17 పుస్తకాలను రచించారు.