న్యూఢిల్లీ : ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా ఉన్న రూ 200 కోట్ల దోపిడీ స్కామ్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల ప్రశ్నించగా తాజాగా మరో నటి నోరా ఫతేహిని గురువారం ఆరుగంటల పాటు ప్రశ్నించారు.
గత నెలలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా చార్జిషీట్లో చేర్చింది. ఆపై ఇదే కేసులో నోరా ఫతేహిని ఈడీ ప్రశ్నించింది. అయితే ఈ కేసులో జాక్వెలిన్తో నేరుగా నోరా ఫతేహికి ఎలాంటి సంబంధం లేదని, పింకీ ఇరానీతో కలిసి ప్రశ్నించేందుకు ఆమెను పిలిపించామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
పింకీ ఇరానీ ఇక్కడే ఉండటంతో ఇద్దరినీ కలిపి ఇంటరాగేట్ చేయాలని తాము భావించామని, కొన్ని విషయాలపై స్పష్టత కోసం ఇలా చేశామని ఈఓడబ్ల్యూ స్పెషల్ కమిషర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ చెప్పారు. ఈ కేసులో నోరా, జాక్వెలిన్ మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.