మణికొండ, జూన్ 5: గండిపేట మండలంలోని 18వ సర్వే నంబర్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. నార్సింగి పోలీసులతోపాటు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ పత్రాలు సృష్టించారన్న గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
ఆ ఆరోపణలు నిజమేనని దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును కోరాడు. కానీ, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో పరారీలో ఉన్న బ్రహ్మనాయుడును పోలీసులు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.