వీణవంక: “హుజూరాబాద్ నియోజకవర్గంకోసం కానీ, ఇక్కడి ప్రజలకోసంకానీ ఈటల రాజీనామా చేశారా..?..కేవలం తన స్వార్థంకోసం బయటకు వచ్చిన ఈటల రాజేందర్కు ఓటడిగే నైతిక హక్కే లేదు..” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శుక్రవారం ఆయన హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ను తాను గత ఐదు నెలలుగా గమనిస్తున్నానని, ఒక్క రోజు కూడా రాజీనామాకు కారణం మాత్రం ఇప్పటి వరకు చెప్పనేలేదని వ్యాఖ్యానించారు. ఈటల తన బాధను..ప్రజల బాధగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వినోద్కుమార్ విమర్శించారు.
తన స్వార్థంకోసం ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలపై ఎన్నికలను రుద్దారని వినోద్కుమార్ మండిపడ్డారు. ఏ కారణం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో ఇకనైనా స్పష్టం చేయాలని ఈటల రాజేందర్ను వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని, రాజకీయంగా పెంచి పెద్దచేసిన సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఈటల రాజేందర్కు హుజూరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్కుమార్ హుజూరాబాద్ ప్రజలను కోరారు.