ధర్మారం, డిసెంబర్24 : తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించారు.
బొట్లవనపర్తి నుంచి పైడిచింతలపల్లి గ్రామం వరకు రూ. 3.56 కోట్ల వ్యయంతో ఖిలావనపర్తి నుంచి జూలపల్లి మండలం కుమ్మరికుంట వరకు రూ. 3.34 కోట్ల వ్యయంతో పీఎంజీఎస్వై పథకం ద్వారా నిర్మించే బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖానంపల్లి, బొట్లవనపర్తి గ్రామాల్లో రూ. 25లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.
బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచులు వాలుక రామయ్య, తీగెల భాగ్యలక్ష్మీ రాజేశంతో పాటు పలువురు వార్డు సభ్యులతో పాటు సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టిని వీడి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇదివరకు సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్లు సాఫీగా చేపట్టగా కేంద్ర ప్రభుత్వం మాత్రం యాసంగి సీజన్లో పండించే దొడ్డు వడ్ల కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా వేస్తుందని మండిపడ్డారు.
దీంతో కేంద్ర ప్రభుత్వ అస్పష్టత విధానం వల్ల రైతులు ఏ పంట సాగు చేయాలనే దానిపై సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
లేదంటే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీసి గుణపాఠం చెప్పాలని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. మంత్రి ఈశ్వర్ వెంట ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మ తదిరులు ఉన్నారు.