న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,779 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). అంతక్రితం ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ రూ.1,047 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,501.94 కోట్ల నుంచి రూ.20,695.90 కోట్లకు తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.7,272.28 కోట్ల నికర లాభాన్ని గడించింది. అలాగే ఆదాయం మాత్రం రూ.83,429 కోట్ల నుంచి రూ.81,364.73 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ఏడాది క్రితం 8.87 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.87 శాతం నుంచి 6.61 శాతానికి దిగొచ్చాయి. విలువ పరంగా చూస్తే రూ.66,671 కోట్ల నుంచి రూ.54,059 కోట్లకు తగ్గాయి. నికర ఎన్పీఏ కూడా 3.09 శాతం(రూ.21,780 కోట్లు) నుంచి 1.72 శాతానికి(రూ.13,365 కోట్లు) తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.1.20 డివిడెండ్ను ప్రకటించింది బ్యాంక్.