ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. మరోసారి ప్రపంచయుద్ధం వచ్చే అవకాశాలున్నాయన్న భయాలతో సూచీలకు సోమవారం బ్లాక్మండేగా నిలిచింది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకోవడం కూడా మార్కెట్ల పతనాన్ని శాసించింది. ఫలితంగా ప్రారంభంలోనే 1,500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సమయం గడస్తున్న కొద్ది సూచీ పాతాళంలోకి జారుకున్నది. చివరకు 1,747.08 పాయింట్లు లేదా 3 శాతం నష్టంతో 56,405.84 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 26, 2021 తర్వాత ఇంతటి స్థాయిలో పతనమవడం కూడా ఇదే తొలిసారి.
17 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పీకల్లోతు నష్టాల్లోకి జారుకున్నది. 17,076 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో 17,099 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత అంతర్జాతీయ, దేశీయ మదుపరులు అమ్మకాలకు పాల్పడటంతో సూచీ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రారంభంలోనే 17 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సూచీ చివరకు 531.95 పాయింట్లు లేదా 3.06 శాతం తగ్గి 16,842.80 వద్దకు జారుకున్నది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రమే 1.05 శాతం లాభపడింది.
సెన్సెక్స్
ప్రారంభం 56,720.32
గరిష్ఠ స్థాయి 57,191.91
కనిష్ఠ స్థాయి 56,295.70
ముగింపు 56,405.84
నిఫ్టీ
ప్రారంభం 17,076.15
గరిష్ఠ స్థాయి 17,099.50
కనిష్ఠ స్థాయి 16,809.65
ముగింపు 16,842.80
8.47 లక్షలు కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మదుపరుల జేబులకు చిల్లులు పెడుతున్నది. సోమవారం సెన్సెక్స్ 1,747 పాయింట్లు నష్టపోవడంతో మదుపరులు ఏకంగా రూ.8.47 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.2,55,42,725.52 కోట్లకు పడిపోయింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,520 పాయింట్లు నష్టపోవడంతో మదుపరులు రూ.12 లక్షల కోట్ల కంటే అధికంగా సంపదను కోల్పోయారు.
సెన్సెక్స్ టాప్-10 పతనాలు
23.03.2020 3,934
12.03.2020 2,919
16.03.2020 2,713
12.05.2020 2,002
09.03.2020 1,942
14.02.2022 1,747
18.03.2020 1,710
13.04.2021 1,708
24.08.2015 1,625
28.02.2020 1,448