హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ప్రజావ్యతిరేక విధానాలను బీజేపీ అనుసరిస్తున్నదని, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టడాన్ని ప్రశంసించాల్సింది పోయి, విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, మ్యూజియం నిర్మాణ పనులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, మెతుకు ఆనంద్, హన్మంతుషిండే, శంకర్నాయక్, చిన్నం దుర్గయ్య, అరూరి రమేశ్, కోరుకంటి చందర్, క్రాంతికిరణ్, సుంకె రవిశంకర్, రేఖానాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గంలోనే సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశానికే తలమానికంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనిపైనా బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. విగ్రహంతోపాటు మ్యూజియం, ధ్యానమందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫొటో గ్యాలరీ, క్యాంటీన్, అతిథుల కోసం గదులను నిర్మిస్తున్నామని, పరిసరాలను పచ్చదనంతో సుందరీకరించనున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ అని నిప్పులు చెరిగారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రాజ్యాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలపై గౌరవాభిమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు.