న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ క్యాబినెట్ మంత్రి ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదని అన్నారు. శుక్రవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజకీయ కుట్రతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, రానున్న రోజుల్లో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నదని చెప్పారు. కానీ, అది అక్రమం, ప్రజా తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించబోతున్నట్టు ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
ఢిల్లీలోని పలు విభాగాల్లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా ఒక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించలేదని, ఉన్నతాధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సాకుగా చూపుతూ మంత్రుల సమావేశాలకు హాజరు కావడం లేదని ఆతిశీ వివరించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ శాసనసభలో 62 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రపతి పాలన భయం వెంటాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ పేర్కొంటూ.. ఆతిశీ రోజుకో కొత్త కథ అల్లుతున్నారని విమర్శించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.