ఖమ్మం, మే 16 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై చేసిన విమర్శలను ఖండిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సోమవారం ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగరంలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ముందుగా భారీ సంఖ్యలో నగరంలోని వీడీవోస్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బండి సంజయ్ దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకవచ్చి ఇల్లెందు క్రాస్రోడ్లో దహనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ బండి సంజయ్ అవాకులు, చెవాకులు పేలితే సహించేదిలేదన్నారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రి అజయ్పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. శవాలపై పేలాలు ఏరుకుంటున్న బీజేపీ నాయకులు కారుకూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. విదేశీ నిధులను తెస్తానన్న ప్రధాని మోదీ ఎందుకు తీసుకరావట్లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. టీఆర్ఎస్పై అనవసర విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, దేవభక్తిని కిశోర్, మాటేటి కిరణ్, మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, ముక్తార్, ఫ్లోర్లీడర్ కర్నాటి కృష్ణ, మంత్రి పీఏ రవికిరణ్, కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.