(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట జాబ్కార్డులు సృష్టించి ప్రజా సొమ్మును దోచుకుంటున్నారని బుందేల్ఖండ్లోని విద్యాధామ్ సమితి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజా భయ్యా గతంలో అధికారులకు అనేకసార్లు ఫిర్యాదుచేశారు. అయినా పట్టించుకున్న నాథుడే లేరు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ఖండ్.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో విస్తరించి ఉంది.
యూపీలోని బందా జిల్లా భన్వార్పూర్ గ్రామంలో దాదాపు 60 మంది కూలీల పేరిట నకిలీ జాబ్ కార్డులు రూపొందించి డబ్బులు దోచుకున్నారని రాజా ఫిర్యాదు చేశారు. అందులో మరణించిన వారు కొందరైతే, కొందరు పట్టణ ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ ఒక్క గ్రామంలోనే కాదు, బుందేల్ఖండ్లోని ప్రతి ఊర్లో ఇలాంటి పరిస్థితే ఉందని, గ్రామ పంచాయితీ సెక్రటరీతో కలిసి అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారని తన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. మధ్యప్రదేశ్ సరిహద్దులోని బిల్హర్క గ్రామ పంచాయితీలో ఘరార్ నదిని జేసీబీతో పూడికలు తీయించి, నకిలీ జాబ్కార్డులు సృష్టించి, కూలీల పేరిట నగదు దోచేశారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
పని చేయని లేదా మరణించిన వందలాది మంది కూలీల పేరిట నకిలీ జాబ్కార్డులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. అధికారులకు, జిల్లా కలెక్టరుకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో కోర్టులో కేసు వేశాను.
– రాజా భయ్యా, అధ్యక్షుడు, విద్యాధామ్ సమితి
పంచాయతీ మిత్ర, గ్రామ కార్యదర్శి కలిసి చనిపోయిన వారి పేరిట రెండు మూడేండ్లుగా డబ్బులు డ్రా చేస్తున్నారు. దాని గురించి ఫిర్యాదు చేసినప్పుడు, అధికారులు ప్రజల ముందే కార్యదర్శిని తిట్టారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– బిజయ్ బహదూర్, హదాహా మాఫి గ్రామం
నా కుమారుడు షౌకత్ ముంబైలో ఉంటూ పెయింటింగ్ వర్క్ చేస్తుంటాడు. అతని జాబ్ కార్డ్ నంబర్ 397. ఉపాధి కూలీ పనులకు రోజూ గ్రామానికి రాలేడు. కానీ అతని జాబ్ కార్డుపై కూలి పని చూపుతూ డబ్బులు డ్రా చేస్తున్నారు.
– రెహమాన్, నారైని గ్రామస్థుడు