బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన స్వామీజీలతో మాకు సంబంధమే లేదు.. వారెవరో తెల్వనే తెల్వదని బుకాయించిన బీజేపీ పెద్దలు.. హైకోర్టు సిట్ దర్యాప్తును రద్దుచేసి, కేసును సీబీఐకి అప్పగించగానే పట్టరాని సంతోషంలో సంబురాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన స్వామీజీలతో ఏ సంబంధం లేదన్న బీజేపీ రాష్ట్ర నేతలు కేసును సీబీఐకి అప్పగించాలని ఎందుకు పిటిషన్ వేశారో ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదు. కానీ ఈ కేసులో ప్రజా కోర్టులో ప్రజలే తుది తీర్పు ఇస్తారని బీజేపీ నాయకులు తెలుసుకోవాలి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సాక్ష్యాధారాలకు సంబంధించి వీడియోలు లీక్ అయ్యాయని భావించిన హైకోర్టు నిందితుల అభ్యర్థన మేరకు కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సరిగా అర్థం చేసుకోని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంబురపడ్డారు. కేంద్రమంత్రి హోదాలో ఉంటూ తెలంగాణ పోలీసుల సామర్థ్యాన్ని తక్కువ చూపేలా మాట్లాడా రు. సీబీఐ మా జేబు సంస్థ… మేము చెప్పినట్లు నడుచుకుంటుందని బహుశా కిషన్ రెడ్డి భావిస్తున్నారేమో! కానీ ఎమ్మెల్యేల ఎర కేసు తాలూకు కీలక సాక్ష్యాధారాలు, వీడియోలు, ఆడియోలు దేశవ్యాప్తంగా జన బాహుళ్యంలోకి వెళ్లాయన్నది ఆయన గుర్తుంచుకోవాలి. ప్రజా క్షేత్రంలో ప్రజలు దీనిమీద ఎప్పుడో విచారణ ప్రారంభించా రు. రేపు ప్రజా కోర్టులో తుది తీర్పు వారే ఇస్తారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు చెప్పిందే కానీ, ఆరోపణలను కొట్టివేయలేదన్న కనీస అవగాహన కిషన్రెడ్డికి లేదని ఆయన ప్రెస్మీ ట్ చూస్తే అర్థమైంది. ఫామ్హౌజ్ ఫైల్స్ సినిమా అట్టర్ ఫ్లాపయిందని, కేసీఆర్ నవ్వుల పాలయ్యారని కిషన్రెడ్డి మీడియా తో అన్నారు. దర్యాప్తు సంస్థ మారితే అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఎలా అవుతుంది? ఈ కేసుతో బీజేపీకి ఏం సంబంధమని బుకాయించిన బీజేపీ నాయకులు అనేక దశల్లో కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారు. న్యాయ నిపుణులు చెప్తున్న దాన్నిబట్టి క్రిమినల్ కేసు దర్యాప్తు దశలో కోర్టులు అడ్డుకునేందుకు అసాధారణ పరిస్థితులు ఉండాలి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఇదే అంశంపై సిట్ సవాల్ చేయనున్నది. సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ ద్వి సభ్య ధర్మాసనానికి అపీల్ చేసే అవకాశం ఉన్నది. ఒక వేళ అక్కడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే సుప్రీంకు వెళ్లే అవకాశం ఉన్నది. స్వామీజీల కుట్రను బయటపెట్టిన తెలంగాణ బిడ్డ, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిపై ఈడీ దాడులు చేయడం చూస్తుంటే, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నదన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరకపోతే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తామన్న స్వామీజీల మాటలు ఇప్పుడు అక్షర సత్యమవుతున్నాయి.
ఫామ్హౌజ్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన స్వామీజీలు కెమెరాలకు చిక్కినప్పుడు భుజాలు తడుముకొని, వారితో తమకు ఏ సంబంధం లేదంటూనే కోర్టుల్లో కేసు దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన కమలం పార్టీ గత ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసి నా నేరం చేసినవాళ్లు ప్రజా కోర్టులో తప్పించుకోలేరు. సరైన సమయంలో తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం సిద్ధంగా ఉంటుంది.
రాజ్యాంగబద్ధమైన సంస్థలను బీజేపీ తన స్వార్థం కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాయకులకు రాజ్యాంగ వ్యవస్థలపై ఇంకా గౌరవం ఉన్నది. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణలతో కేంద్రం రాష్ట్ర సర్కారును, రాష్ట్ర మంత్రులను, ఇతర పెద్దలను ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. దర్యా ప్తు సంస్థల నోటీసులకు విలువ ఇచ్చి సహకరిస్తున్నారు తప్పితే.. ఎక్కడా కుంటిసా కులు చెప్పి తప్పించుకోవడం లేదు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో దేశ వ్యాప్తంగా పలు నగరా లు తిరిగిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఎవరికి ఎవ రు విమాన టిక్కెట్లు బుక్ చేశారు? ఎవరి ఖాతా నుంచి డబ్బులు వెళ్లాయి? ఈ కుట్రను నడుపుతున్నది, నడిపిస్తున్నదెవరు? అనే దానిపై లోతైన అధ్యయనం చేశా రు. కేసు విచారణలో భాగంగా రెండుసార్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సిట్ అధికారులు నోటీసులు ఇస్తే, ఆయన విచారణకు హాజరు కాలేదు. తప్పు చేయనప్పుడు విచారణకు హాజరయ్యేందుకు భయం ఎందుకు? బీజేపీ పెద్దలకు ఒక విధానం.. మిగతా ప్రజలకు ఒక విధానం ఉంటుందా ఈ దేశంలో?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణకు సంబంధించి సిట్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి, సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నది. ఇదేదీ పట్టని కొందరు ‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా.. సీబీఐ రాష్ట్రంలోకి వచ్చేస్తున్నది. ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేయబోతున్నదనే దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు దాన్ని నిజమని నమ్ముతారని వారి ఆశ. బీజేపీ ఎత్తుగడ లు, కుట్రలు తెలంగాణలో సాగవన్న విష యం వారికి తెలియదు. ఇది చైతన్యవంతమైన గడ్డ. బీజేపీ నేతలు కుట్ర రాజకీయాలకు స్వస్థి పలికి ఇకనైనా తెలంగాణ ప్రభుత్వంతో అభివృద్ధిలో పోటీ పడాలి. లేదంటే మీ కుట్రలను తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తప్పకుండా తిప్పికొడతారు. తస్మాత్ జాగ్రత్త!
బచ్చు శ్రీనివాస్: 93483 11117