కోల్కతా, మార్చి 2: బెంగాల్ ప్రజలు మరోసారి బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన జాతీయ పాలకపక్షానికి శృంగభంగమైంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనానికి పోటీనివ్వలేకపోయింది. మొత్తం 108 మున్సిపాలిటీల్లో 102 నగర పాలికలను టీఎంసీ కైవసం చేసుకుని బెంగాల్లో సీఎం మమతకు తిరుగులేదని నిరూపించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ ఒక్కటంటే ఒక్క నగరపాలికను దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితీ అంతే. నందిగ్రాంలో మమతపై పోటీచేసి గెలిచిన బీజేపీ నేత సువేందు అధికారి కంచుకోట లాంటి కాంథీ మున్సిపాలిటీ టీఎంసీ ఖాతాలో పడడం విశేషం. నాలుగు దశాబ్దాలుగా ఈ మున్సిపాలిటీ సువేందు కుటుంబం చేతుల్లోనే ఉంది. ఘోర ఓటమి పాలైన బీజేపీ ఎన్నికల నిర్వహణ బాగాలేదని శాపనార్థాలు పెడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించింది. కాగా సీఎం మమతా బెనర్జీ విపక్షాలవి ఆడలేక మద్దెల ఓడు ఆరోపణలని కొట్టిపారేశారు. టీఎంసీపై పూర్తి నమ్మకం ఉంచినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నదియా జిల్లాలోని తాహెర్పూర్ మున్సిపాలిటీని సీపీఎం కూటమి దక్కించుకుంది. పర్వతప్రాంతమైన డార్జీలింగ్లో హమ్రో పార్టీ (మన పార్టీ) ఘనవిజయం సాధించింది. మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే.