పట్నా : సీఎం పదవి కోసం బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యూ) చీఫ్ నితీష్ కుమార్ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ చేతులు కలుపుతారని బీజేపీ ఎంపీ చెది పాశ్వాన్ ఆరోపించారు. నితీష్ను సీఎంను చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం పొరపాటు చేసిందని పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ-జేడీ(యూ) కూటమిలో కలకలం రేపాయి.
బిహార్లో బీజేపీ ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి కోసం నితీష్ కుమార్ ఎంతకైనా దిగజారుతారని, ఆయన గతంలో ఇలా చేశారని ఇప్పుడు కూడా చేస్తారని వ్యాఖ్యానించారు. నితీష్ బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఈ దిశగా కాషాయ పార్టీ అగ్రనాయకత్వం సరైన చర్యలు చేపట్టాలని కోరారు. బీజేపీని బ్లాక్మెయిల్ చేసేందుకు నితీష్ కుమార్తో పాటు ఆయన పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నారని చెప్పారు.
బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికైనా కండ్లుతెరిచి సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కులగణన డిమాండ్ను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్యాబినెట్ తోసిపుచ్చినా నితీష్ పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినా బిహార్కు ప్రత్యేక హోదా కోసం నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని పాశ్వాన్ ఆరోపించారు. నితీష్ కుమార్ సంకీర్ణ ధర్మానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ పాశ్వాన్ ఆక్షేపించారు.