బారిపదా (ఒడిశా), జనవరి 21: అధికార గర్వంతో ఇద్దరు ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడ్డాడు బీజేపీకి చెందిన ఓ కేంద్రమంత్రి. బాధ్యతాయుత పదవిలో ఉన్నానన్న సోయి కూడా లేకుండా సీనియర్ అధికారుల మీదకు కుర్చీలు విసిరేసి దుర్భాషలాడాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే మీటింగ్కు ఫైల్స్ తీసుకురాలేదని అధికారులు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా తన దురహంకారాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన ఒడిశాలోని బారిపదాలో ఇటీవల చోటుచేసుకొన్నది. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర జల్శక్తి, గిరిజన మంత్రిత్వ శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు ఇటీవల ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల దేబషిస్ మహాపాత్ర, అశ్వినిన్ మాలిక్ అనే ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఆ మీటింగ్కి కొన్ని అధికారిక ఫైల్స్ తీసుకురాలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి దుర్భాషలాడుతూ.. ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. కుర్చీలు విసిరి వేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.