ఆదిలాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం మంత్రి అల్లోల ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఐదు రాష్ర్టాల్లో జరిగే ఎన్నికలకు భయపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నదన్నారు. కేంద్రం 70 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట అదానీ, అంబానీలకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నదని, ఈ నిర్ణయంతో వేలాది మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వివిధ రాష్ర్టాలు మన పథకాలను అమలు చేస్తున్నాయని, తమిళనాడు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటించి అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను ముట్టుకొంటే మాడి మసైపోతారని హెచ్చరించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.