హుజూరాబాద్ : గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ నాయకులు కృత్రిమ సానుభూతి కోసం టీఆర్ఎస్ పై బురద జల్లుతూ జూటా మాటలు.. గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ ఎన్నికలు ఈటల మోసానికి, గెల్లు విదేయతకు మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు. రాజేందర్ ఎక్కడ ఉపన్యాసానికి వచ్చినా..నేను ఈ పని చేసినా..గెలిస్తే ఇది చేస్తా అని చెప్పకుండా కరెంట్ కట్ చేస్తున్నారని, మైక్ కట్ చేస్తున్నారని, మా మీద దాడి చేస్తారేమోనని బురద జల్లుకుంటున్నారని ఆరోపించారు.
రాజేందర్ కు ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ కలిపిస్తుందని, భయపడాల్సిన అవసరం లేదని హరీశ్రావు అన్నారు. తాను డబులు బెడ్ రూం ఇండకలు కట్టిన, ఓ కాలేజీ తెచ్చిన, ఓ స్టేడియం తెచ్చిన అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదని అందుకే గోబెల్స్ ప్రచారానికి దిగారన్నారు. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, గ్యాస్ ధరలను వెయ్యి చేసి బతుకమ్మ ఆఫర్గా పండుగ పూట మరో 15 రూపాయలు పెంచారని మంత్రి ఎద్దేవా చేశారు.
రాజేందర్కు ఆరుసార్లు 17 ఏండ్లు అవకాశం ఇచ్చారని కానీ ఏం చేశాడన్నారు? మొన్నటిదాకా బీజేపీని తిట్టిన నీవు ఆ పార్టీలో ఎలా చేరావని, బీజేపీకి ఓటు వేయాలని ఎలా అడుగుతున్నావని మంత్రి ప్రశ్నించారు. రోజుకో కేంద్రమంత్రి వచ్చి చేసిందేం లేదని, మేము వస్తే ఈ రోడ్డు బాగలేదంటే బాగు చేయించినం. ఏది కాావాలంటే ఆ పనులు చేయించినం. సమ స్యలు ఉన్నాయంటే పరిష్కరించాం. ప్రజలు కోరుకున్న పనులు మేం చేశామని స్పష్టం చేశారు.
రాజేందర్ బీసీ నాయకుడ్ని అంటున్నడు. రెండో సారి బీసీ గణన జరగాలని సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలని తెలంగాణ శాసన సభ ఏక గ్రీవ తీర్మానం చేసి పంపింది. ఈ విషయం మీరు చేరిన బీజేపీ పార్టీని ఒప్పించవచ్చు కదా.. అని ఆయన చురకలంటించారు.
22 ఏండ్లు బీజేపీలో పనిచేసిన మహేందర్రెడ్డిలాంటి నాయకుడిని కాపాడుకోలేకపోయావని ఇక నీవు ప్రజల్ని ఏం కాపాడుతావని హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ఈ పదిహేను రోజులు కష్టపడితే నేను, గంగుల కమలాకర్, గెల్లుతో కలిసి ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం,సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని , వందల కోట్ల శ్రీమంతులు ఎవరో..పేదింటి బిడ్డ ఎవరో మీరే చూశారు. గెల్లు పేద బిడ్డ న్యాయాన్ని గెలిపించండి. అని మంత్రి కోరారు.