కరీంనగర్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో జరిగిన రాష్ట్ర స్థాయి బీసీల ఆత్మీయ సమ్మేళనంలో.. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ను ఆర్ కృష్ణయ్యతోపాటు వివిధ బీసీ కుల సంఘాల నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కులాల వారీగా బీసీల జనాభాను లెక్కించాలని ప్రధాని మోదీని కలిసి కోరితే సానుకూలంగా స్పందించారని, అయితే ఆ తర్వాత ఎవరి ఒత్తిడికో తలొగ్గి వెనక్కి తగ్గారన్నారు. బీసీలు పాకిస్థాన్, చైనా, అమెరికా నుంచి రాలేదని, అసలైన భారతీయులని స్పష్టం చేశారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల వారీగా జనగణన జరపాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని, ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సానుభూతికి, బట్టేబాజి మాటలకు మోసపోయి బీజేపీకి ఓట్లు వేయొద్దని సూచించారు.
అభివృద్ధిలో తెలంగాణ భేష్..
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోని ఏ ఇతర రాష్ర్టాల్లో జరగడం లేదని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇతర రాష్ర్టాల ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేసుకోవాలని అభ్యర్థిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇంత మంచి స్వర్గ సీమలో మనం ఉండటం గర్వకారణమన్నారు. ఇతర రాష్ర్టాల్లో బీసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. దళితబంధు పథకం వచ్చినప్పుడు తాను కేసీఆర్ను కలిసి బీసీ బంధు కావాలని కోరితే.. ఆర్థికంగా చేయితిరిగిన తర్వాత తప్పకుండా ప్రవేశ పెడతానని మాట ఇచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్పై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని, త్వరలో బీసీబంధు పథకం అమలు చేస్తారని చెప్పారు.
బీజేపీకి బుద్ధి చెప్పాలి: వకుళాభరణం
బీసీలను నిర్లక్ష్యం చేసే బీజేపీకి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. కేంద్రం లో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరితే స్పందించలేదన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంఘం నేత రాజారాం యాదవ్, టీఆర్ఎస్ నేత లింగంపల్లి కిషన్రావు, వివిధ బీసీ సంఘాల నాయకులు గాదె సమ్మయ్య, శివాజీ, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, జయంత్రావు, డాక్టర్ కే శ్రీనివాస్, కోల శ్రీనివాస్, వైద్య వెంకటేశ్వర్లు, దాస్యం సత్యం, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.