జోర్హాట్ : అస్సాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆదివారం అస్సాంలోని జోర్హాట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మాట తప్పింది. సంస్కృతి పరిరక్షణకు అస్సాం ఒప్పందంలోని క్లాజ్ -6ను అమలు చేయలేదు. రాష్ట్రంలో పౌర సవరణ చట్టం అమలు చేయమన్న హామీపైనా బీజేపీ వెనకడుగు వేస్తున్నది.
తేయాకు కార్మికులకు పనికి తగిన వేతనం, సరైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల వేళ పలు సామాజిక మాధ్యమాల్లో ప్రధాని కన్నీరుకారుస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినప్పుడు ఆయన కన్నీరు ఏమైంది’ అని ప్రియాంక నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా ప్రధానిలో కనీస పశ్చాత్తాపం లేదని అన్నారు. 126 స్థానాలున్న అస్సాం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 27న తొలివిడత ఎన్నికలు ప్రారంభంకానుండగా.. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.