బీజేపీ నేతలు ఉనికి కాపాడుకోవడానికి.. మతి కోల్పోయినట్లు వ్యవహరించారు. ఏ సమయంలో ఏం చేయాలో తెలియక వీధి రౌడీల్లా మారారు. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులమనేది మరిచి.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. బల్దియాలో ప్రజా సమస్యలపై వాదించి పరిష్కరించాల్సిన కాషాయ పార్టీ కార్పొరేటర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని కూడా తెల్వదు. స్వయంగా మేయర్ తన వద్దకు వచ్చి సమస్యలపై వివరించాలని కార్పొరేటర్లకు అపాయిట్మెంట్ ఇచ్చినా.. దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రౌడీ మూకలు ముందస్తు ప్లాన్తోనే బ్లాక్ స్ప్రే వెంటతెచ్చుకొని బరితెగించడం సిగ్గు చేటని నగర వాసులు విమర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన కమలం నేతలు గుండాల్లా మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడు తున్నారు. బల్దియా కార్యాలయంపై మంగళవారం బీజేపీ నేతలు చేసిన దాడిని నగర వాసులు ఖండిస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు బరి తెగించారు. వీధి రౌడీల్లా వ్యవహరించారు. ప్రజాప్రతినిధులు అనే కనీస బాధ్యతను మరిచి వీధి గుండాల్లా.. రెచ్చిపోయారు. కార్యకర్తల ముసుగులో రౌడీలను వెంట పెట్టుకొని వచ్చి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో బీభత్సం సృష్టించారు. ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు వద్దని వారించినా.. వినిపించుకోకుండా రెచ్చిపోయారు. మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లి మేయర్ చాంబర్ను చిన్నాభిన్నం చేశారు.
పక్కా ప్లాన్ ప్రకారమే దాడి
బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పక్కా ప్లాన్ ప్రకారమే బీభత్సం సృష్టించారన్నది స్పష్టమవుతున్నది. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి తన వెంట బ్లాక్ స్ప్రే తీసుకువచ్చి పౌరులు, సంస్థ ఉద్యోగులు పవిత్రంగా భావించే జీహెచ్ఎంసీ లోగోను నల్లరంగుతో అవమానపర్చారు. వీధి రౌడీలుగా మారి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. మేయర్ సీటుకు నల్ల రంగు రిబ్బన్తో పాటు, కాషాయ జెండాను చుట్టారు. ఉదయం 11 గంటల సమయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతామంటూ వచ్చి మేయర్ చాంబర్లో నానా హంగామా చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. తోపులాటతో హల్చల్ చేశారు. అరెస్ట్ చేస్తే ఇంకా హీరోలు కావాలన్న ఏకైక ఎజెండాతో పోలీసులను రెచ్చగొట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి.
దాడి హేయమైన చర్య
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
బీజేపీ కార్పొరేటర్లు వారి అనుచరులతో జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిషరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఆస్తులు ధ్వంసం చేయడం సరియైన చర్య కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా ఈ గొడవ చేశారని, ఈ విషయం సహించరాదని అన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేస్తుందని తెలిపారు. తనను కలిసేందుకు అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ రాలేదని, బీజేపీ కార్పొరేటర్లు ఎందుకురాలేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు.
రాజీ లేకుండా.. పనిచేస్తున్నాం
జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలను పరిషరించటంలో రాజీపడటం లేదని మేయర్ అన్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో తాను స్వయంగా లోతట్టు ప్రాంతాలను సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎల్బీనగర్ జోన్లోని సరూర్నగర్ ప్రాంతంలో ఎకువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష జరిపి పరిషార చర్యలు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు పర్యటించి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలు తలెత్తకుండా పనిచేసినట్లు తెలిపారు. మేయర్ కార్యాలయం నిరంతరాయంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిషరించడం జరిగిందని గుర్తు చేశారు.
బీజేపీ కార్పొరేటర్లపై ఫిర్యాదు
బీజేపీ నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన కార్పొరేటర్లు మేయర్ చాంబర్లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించి అధికారుల పనులకు ఆటంకం కలిగించడంతో పాటు పూలకుండీలు, అద్దాలను పగులగొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో రవికుమార్ (రామ్నగర్), కరుణాకర్ (గుడిమల్కాపూర్), రాధా (ఆర్కేపురం), భాగ్యలక్ష్మి (మూసారాంబాగ్), మహాలక్ష్మి (హిమాయత్నగర్), మహేందర్ (మూసాపేట్), శంకర్యాదవ్ (బేగంబజార్) తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
జీహెచ్ఎంసీ లోగోపై బ్లాక్స్ స్ప్రే
మైలార్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ లోగోపై బ్లాక్స్ స్ప్రే చేసి హల్చల్ చేశాడు. ఎలక్ట్రికల్ మైక్లను, పూల కుండీలను, అద్దాలను, కుర్చీలను ధ్వంసం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ ఉందని తెలిసినా తమ ఉనికిని కాపాడుకోవాలన్న ఏకైక ఎజెండాయే లక్ష్యంగా అతి చేశారు. బీజేపీ కార్పొరేటర్ల బీభత్సంతో మేయర్, డిప్యూటీ మేయర్, కార్యదర్శి, సిబ్బంది భయంతో తలుపులు మూసుకున్నారు. రౌడీల్లా కమిషనర్ చాంబర్ వైపు పరుగులు పెట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కమిషనర్ పేషీ సిబ్బంది భయంతో బిక్కుబిక్కుమన్నారు.