హైదరాబాద్, జనవరి 10 : నోటిఫికేషన్లు, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ కొత్త కుట్రకు తెరలేపిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. జీవో -317ను సాకుగా చూపించి యువత జీవితాలతో చెలగాటమాడుతున్నదని చెప్తున్నారు. బీజేపీ నాటకాన్ని చూస్తుంటే ఉద్యోగాల భర్తీని నిలువరించడమే ఆ పార్టీ ఎజెండాగా కనిపిస్తున్నదని, ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రాబోయే ఎన్నికల్లో తమ గెలుపునకు ఇది ప్రతిబంధకంగా మారుతుందనే కుట్రకు బీజేపీ తెరలేపిందని స్పష్టం చేస్తున్నారు. ‘ఆ పార్టీ నేతులు ఒకసారేమో జీవో 317ను సవరించాలంటారు. మరోసారేమో జీవోను వెనక్కి తీసుకోవాలంటారు. అసలు విషయమేమిటంటే.. ఆ జీవోపై బీజేపీకే స్పష్టత లేదు’ అని తెలిపారు.
తేలితేనే కదా.. భర్తీకి వీలయ్యేది
ప్రస్తుతం ఉద్యోగులంతా ఉమ్మడి జిల్లా యూనిట్గా పనిచేస్తున్నారని, వీరిని కొత్త జిల్లాల ప్రకారం కేటాయించటంలో భాగంగానే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం జీవో-317ను తీసుకొచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ‘ఖాళీలన్నింటినీ భర్తీచేయాలని కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ ప్రకారం పోస్టులను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయనేది తేలుతుంది. ఆయా ఖాళీల ప్రకారమే నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అలా తేల్చవద్దనే బీజేపీ రాద్ధాంతం చేస్తున్నది, ప్రక్రియకు అడ్డుపడుతున్నది’ అని పేర్కొన్నారు.
పార్లమెంట్లో కొట్లాడినా బీజేపీ పట్టించుకోలేదు
ఏపీ, తెలంగాణ విభజన సమయంలో స్థానికతకు చోటు కల్పించాలని తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడినా బీజేపీ పట్టించుకోలేదు. ఉద్యోగ సంఘాలుగా మేం ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. బదిలీల్లో ఏవైనా సమస్యలుంటే వినతులు, అప్పీళ్ల ద్వారా పరిష్కరించుకోవచ్చు. జీవో-317తో తలెత్తే సమస్యలేవైనా ఉంటే అవన్నీ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకొనేవే. దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. జీవో-317ను అడ్డుకొంటే ఉద్యోగాల భర్తీని అడ్డుకొన్నట్టే. – దేవీప్రసాదరావు, టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు
రాజకీయం చేస్తే బీజేపీ ఆఫీస్ను ముట్టడిస్తాం
జీవో -317 ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తయితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. నిరుద్యోగులు, ఉద్యోగుల మధ్య అనవసరంగా చిచ్చుపెడితే ఊరుకోం. నిరుద్యోగులను రాజకీయంగా వాడుకొంటే బీజేపీ ఆఫీస్ను ముట్టడిస్తాం. – బండారి వీరబాబు, ఓయూ జేఏసీ చైర్మన్