ప్రతి నోటిఫికేషన్లో రంధ్రాన్వేషణ చేయాలని సమావేశంలో ఓ బీజేపీ ముఖ్యనేత సూచనలు ఆవేదనతో విషయాన్ని లీక్ చేసిన మరోనేత ఇదీ యువతపై మా వాళ్ల ప్రేమంటూ ఆక్రోశం మరో నేత పేరుతో సోషల్మీడియాలో చాట్ అన్యాపదేశంగా కేసుల విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్షుడు బండి సంజయ్ యువతా.. తస్మాత్ జాగ్రత్తంటున్న టీఆర్ఎస్
అదే దుర్మార్గం, అదే పన్నాగం, అదే కుతంత్రం, అదే కౌటిల్యం.
తెలంగాణ రాష్ట్రం రాకుండా పన్నిన కుట్రల్లాంటివే మళ్లీ!
ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వేసిన ఎత్తుగడల్లాంటివే మళ్లీ!
పలు పథకాలు అమలు కాకుండా వేసిన చిల్లర వ్యూహాల్లాంటివే మళ్లీ!
ఒకరో ఇద్దరో బకరాలను చూపెట్టు. కోడి గుడ్డు మీద వెంట్రుకలు వెతికిపట్టు. తప్పుల పేరుతో కేసులు పెట్టు. కోర్టుల తలుపు తట్టు. ఉద్యోగాల భర్తీకి మోకాలడ్డు పెట్టు! ఇదీ రాష్ట్రంలోని విపక్షాల దుర్నీతి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన 91 వేల ఉద్యోగాల ప్రకటనతో కంగుతిని, ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రతిపక్ష ప్రముఖులు, నియామకాలు కనుక పూర్తయితే తమకు పుట్టగతులుండవని, తమ పార్టీల పుట్టి మునిగిపోవడం ఖాయమని బెంబేలెత్తుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల లోపే ఉన్నందున, ఏదోరకంగా కోర్టు కేసులు వేయించి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి అడ్డమైన మార్గాలు, అడ్డదారులు వెతుకుతున్నారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బాగుపడకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీ మరోసారి విషాన్ని చిమ్ముతున్నది. బుధవారం 91 వేల ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటనతో దిమ్మతిరిగిన బీజేపీ నేతలు భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషించడం అప్పుడే మొదలుపెట్టింది. సీఎం ప్రకటన అయిన వెంటనే పార్టీ హడావుడిగా అంతర్గత సమావేశాన్ని పెట్టుకొని.. ఉద్యోగాల ప్రక్రియను ఆపడంపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే రాష్ట్రంలో తమ పార్టీకి భవిష్యత్తు ఉండదని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోయినా కొద్దోగొప్పో వెంట ఉంటారనుకొన్న యువత దీంతో పూర్తిగా దూరమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తున్నది. దీంతో కోర్టు కేసులతో నోటిఫికేషన్లను అడ్డుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు స్వయంగా ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి బీజేపీ తలపెట్టిన అన్యాయాన్ని వివరించారు. దీనిని బట్టే బీజేపీ నేతలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో వింటేనే విస్మయం కలుగుతున్నది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కోర్టుల్లో కేసులకు రెడీ
బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తిలో చెప్పిన తర్వాత.. మహా అయితే 10-20 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తారని బీజేపీ నేతలు అంచనావేశారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి 91 వేల ఉద్యోగాల ప్రకటనను వారు ఊహించలేదు. దీంతో కీలక నేతలు బుధవారం ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేకపోయినా ఒక వర్గం యువత మద్దతుతోనే మనుగడ సాగిస్తున్నదని, ఉద్యోగాలను భర్తీ సజావుగా సాగితే వారు కూడా దూరం అవుతారని నేతలు ఆందోళన వెలిబుచ్చారు. దీంతో నోటిఫికేషన్లను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రస్థాయి నేత ఒకరు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ రాగానే లీగల్ టీమ్కు పంపి అందులో ఉన్న లొసుగులను గుర్తించాలని, వాటి ఆధారంగా బీజేపీ కార్యకర్తలతోనే కోర్టులో కేసు వేయించాలని సూచించినట్టు సమాచారం. తద్వారా ఓవైపు ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేయవచ్చని, మరోవైపు ప్రభుత్వాన్ని బదనాం చేయవచ్చని చెప్పినట్టు తెలిసింది.
ఎన్నికలకు మరో 20 నెలలు మిగిలి ఉన్నాయి. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్లను ఏడాది.. ఏడాదిన్నరపాటు ఆపగలిగితే వాటి భర్తీ ప్రక్రియ ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తికాదని నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. నోటిఫికేషన్లోనో, ప్రాసెస్ సమయంలోనో ఏ చిన్న లోపం కనిపించినా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయడంతోపాటు, పార్టీ సానుభూతిపరులను కాపాడుకోవచ్చని, మరోవైపు యువ ఓటర్లను టీఆర్ఎస్కు దూరం చేయవచ్చని ఆలోచించినట్టు సమాచారం. గతంలో మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ నిర్మాణం సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే చేశారని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, ప్రాజెక్టు నిర్మాణాలను ఆలస్యమయ్యేలా చేశారని గుర్తు చేసుకొన్నారు. ఈ ఆలోచన బాగుందంటూ కొందరు కీలకనేతలు ఆనందంగా చెప్పినట్టు సమాచారం. ఆ సమావేశంలో ఉన్న ఒక కీలక నేత ఈ అన్యాయాన్ని చూసి భరించలేక ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి, ఈ కుతంత్రాన్ని వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘లోపాలకు తావు లేకుండా నోటిఫికేషన్ వేయాలి. కోర్టుల్లో కేసులకు తావు లేకుండా, జాప్యం లేకుండా భర్తీ చేయాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఆహ్వానించాల్సిందిపోయి.. ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ మాటలు ఎందుకు మాట్లాడినట్టు? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కుతంత్రాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారంటూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను బలిపెట్టే రాక్షస క్రీడ ఆడుతున్నది. నిరుద్యోగులను మతం మత్తులో ఉంచడం, సోషల్ మీడియాలో ప్రచారానికి వాడుకోవడమే బీజేపీ ప్లాన్. నోటిఫికేషన్లపై ఒక్కసారి కోర్టుకు పోతే తీర్పు ఎప్పుడొస్తుందనేది దైవాధీనం. ఓపక్క కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెప్తున్నది. అక్కడ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని మోదీని అడిగే దమ్ము వీళ్లకు లేదు. రాష్ట్రంలో మాత్రం వీధి నాటకాలాడతారు. రాష్ట్రంలో సశాస్త్రీయంగా జోన్ల వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకొని.. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించి నోటిఫికేషన్లకు సిద్ధమైన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి దారుణమైన కుతంత్రాలతో నిరుద్యోగులను బలిపెట్టాలని చూస్తున్నారు. ఇట్లాంటి వికృత పోకడలను భరించలేకే బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిలించి బంగాళాఖాతంలో ఇసిరెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. బీజేపీ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలను యువత అర్థం చేసుకోవాలని, అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.
బీజేపీ అంతర్గత చర్చలో భాగంగా ఒక నేత మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఉద్యోగ భర్తీపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో అక్కడున్న మిగతా నేతలు ఆయనను అడ్డుకొని.. బయట ఎక్కడా అనొద్దు.. పరువు పోతుంది. ప్రభుత్వం రూ.3 వేల కోట్లను అదనంగా కేటాయించింది అని గుర్తు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం పకడ్బందీగా చేస్తున్న ఉద్యోగ భర్తీ ప్రక్రియపై కనీస అవగాహన కూడా లేకుండానే నేతలు మాట్లాడినట్టు తెలిసింది.
‘ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన వెంటనే అందులో లొసుగులను గుర్తించాలి. కొంతమందిని ప్రేరేపించి కోర్టులో కేసు వేయాలి. కోర్టు స్టే ఇస్తే భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుంది’ అని బీజేపీ అంతర్గత సమావేశంలో ఒక సీనియర్ నాయకుడు చెప్పినట్టు తెలిసింది. ఈ అభిప్రాయాన్ని మిగిలిన నేతలంతా అంగీకరించినట్టు సమాచారం.