వరంగల్చౌరస్తా, జూలై 21: వరంగల్, హనుమకొండ పరిధిలో జువెల్లరీ షోరూమ్ లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) అధికారులు రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సోమవారం జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో తనిఖీలను కొనసాగించారు. నగరంలో 50 షోరూమ్లు ఉండగా 8 షాపుల్లో తనిఖీలు నిర్వహించి 7కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. యూనిక్ ఐడెంటిటీ నంబర్ ముద్రించని ఆభరణాలను సీజ్ చేశారు.
నాగర్కర్నూల్ టౌన్, జూలై 21 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శస్త్ర చికిత్స లేకుండా ఒకే ప్రసవంలో ముగ్గురు శిశువులు జన్మించారు. పెద్దకొత్తపల్లి మండలం నారాయణపల్లికి చెందిన శివ, అనిత దంపతులకు ఇది మొదటి కాన్పు. ప్రసవం కోసం సోమవారం అనితను నాగర్కర్నూల్లోని ప్రగతి నర్సింగ్ హోమ్లో చేర్పించారు. డాక్టర్లు సాధారణ ప్రసవం చేయగా.. ఒక ఆడ, ఇద్దరు మగబిడ్డలు జన్మించారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ మిగతా వర్సిటీలతో పోల్చితే వెనుకబడింది. మిగతా వర్సిటీల్లో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలకాగా, ఈ ఒక్క యూనివర్సిటీలో మాత్రం ఇంతవరకు విడుదల కాలేదు. దీంతో మెమోలు రాక ఉన్నత చదవులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ కారణంగానే లాసెట్ 2026-27 వెబ్ కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు షెడ్యూల్ సవరించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 10 వరకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉన్నది. ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడంతో రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 వరకు పొడిగించారు. అయినా ఫలితాలు విడుదలకాకపోవడంతో తాజాగా జూలై 28కి పొడిగించారు.