హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిరస్మరణీయుడని సీఎం కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సోమవారం బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం పోరాడుతూ అతి చిన్న వయస్సులో ప్రాణత్యాగం చేసిన ఆయన, దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బిర్సా ముండా పోరు స్ఫూర్తిదాయకమని గవర్నర్ తమిళిసైసౌందర్రాజన్ పేర్కొన్నారు. రాజ్భవన్లో బిర్సా ముండా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఆదివాసీ గిరిజన పోరాట యోధుడు రాంజీగోండ్ స్మారకార్థం మ్యూజియం నిర్మాణానికి హైదరాబాద్ అబిడ్స్లో త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఆదివాసీ పోరాటయోధుడు బిర్సా ముండా జయంతి వారోత్సవా ల సందర్భంగా సోమవారం సంక్షేమభవన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో భీం స్మారక మ్యూజియాన్ని ఏర్పాటుచేసుకున్నామని, హైదరాబాద్లో బంజార, ఆదివాసీ భవనాలు పూర్తి చేసుకున్నామని వివరించారు.
ఈ సందర్భంగా భీం మనుమడు కుమ్రం సోనేరావును మంత్రి సత్కరించారు. భీం, రాంజీగోండ్ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. తన తాత కుమ్రంభీం ఆశయాలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని సోనేరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, గురుకుల విద్యాలయాల అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్, టీసీఆర్టీఐ సంచాలకుడు ఆర్ సర్వేశ్వర్రెడ్డి, పీఐబీ అధికారి కృష్ణకాంత్ పాల్గొన్నా రు. అనంతరం దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు.