హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నది. వీటిని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో నాన్ గెజిటెడ్ టరినేరియర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవాల పెంపకంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. జీవాల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను అన్ని ప్రభుత్వ పశువైద్య శాలల్లో అందుబాటులో ఉంచిందన్నారు.
జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంచార పశువైద్య శాలల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రాంతాలలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా రైతుల మెప్పు పొందాలని, తద్వారా పశుసంవర్ధక శాఖ కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాన్ గెజిటెడ్ వెటరినేరియర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్, కోశాధికారి సుదర్శన్, గణేష్ రెడ్డి, జ్ఞానేశ్వర్, అజీమోద్దిన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.