భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దివ్య ఔషధం నీరా అని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని నందనం తాటి ఉత్పత్తుల కేంద్రం ఆవరణలో బీఎల్ఆర్ ఫౌండేషన్, నంద సేవా సమితి ఆధ్వర్యంలో బీహార్ తాటి పొట్టి విత్తనాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి నాటి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ యువత గీత వృత్తిపై ఆసక్తిని పెంపొందించుకుని వృత్తిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఒక తాటి చెట్టు 2 లక్షల కుటుంబాలకు ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పారు. రోజు రోజుకూ వృతి తగ్గుముఖం పడుతుందని ఈక్రమంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. బీహార్ తాటి పొట్టి విత్తనాలతో తాటి చెట్లను విస్తృతంగా పెంచుకోవచ్చన్నారు. ఈరకం విత్తనాలతో సాధారణ తాటిచెట్టుతో పోలిస్తే సగానికి పైగా చిన్నగా ఉంటుందని, ప్రమాద అవకాశాలు తగ్గుతాయన్నారు. నాటిన ప్రతి చెట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత వృత్తిదారులపై ఉందన్నారు. నీరాలో ఎన్నో ఔషద గుణాలున్నాయని, రోగ నిరోధక శక్తిగా పని చేస్తుందన్నారు. భవిష్యత్లో నీరా కేంద్రాలతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ గీత వృత్తి ఎంతో కష్టతరమైనదని, బీహార్ తాటి పొట్టి రకం విత్తనాలతో చెట్లు పెంచితే ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చన్నారు. జిల్లాలో గీతా కార్మికులు అధికంగా ఉన్నారని, వారి కోసం నీరా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరా ప్లాంట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతాయన్నారు. భవిష్యత్లో పాల సేకరణ కేంద్రాల మాదిరిగా నీరా కేంద్రాలు ఉంటాయని ఎంతో ప్రయోజనకారిగా మారుతాయన్నారు. గ్రామ సర్పంచ్ కడమంచి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంగాల వెంకన్నగౌడ్, ఎంపీపీ నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్కుమార్, సీఐ నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణగౌడ్, ఎంపీటీసీ మట్ట పారిజాత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు రాఘవేందర్రెడ్డి, రాజేశ్వర్రావు, ధనుంజయ, రాజయ్య, సత్యనారాయణ, రమేశ్, మధు, మహేశ్ పాల్గొన్నారు.
రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
భువనగిరి పరిధిలో గల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ తోటకూరి వెంకటేశ్యాదవ్ ఆయన్ను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంగాల వెంకన్నగౌడ్, సత్యనారాయణగౌడ్ ఉన్నారు.