కొందరి జీవితాలు సినిమాల కన్నా స్ఫూర్తిమంతంగా ఉంటాయి. వాళ్ల కథలు మనలో నిద్రాణమైన పట్టుదలను తట్టి లేపుతాయి. అలాంటి కథే కమల్ కిషోర్ మండల్ది. బిహార్లోని భగల్పూర్కు చెందిన కమల్ కిషోర్.. 23 ఏళ్ల వయసులో ఆర్డీ అండ్ డీజే కాలేజీలో నైట్ గార్డ్గా తన కెరీర్ ఆరంభించాడు. అప్పటికే పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ.. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల 2003లో నైట్ గార్డ్ పనిలో చేరాల్సి వచ్చింది.
ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి డిప్యుటేషన్ మీద 2008లో తిల్కా మాంఝీ భగల్పూర్ యూనివర్సిటీ (టీఎంబీయూ)లోని ‘అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్’ (పోస్ట్ గ్రాడ్యుయేట్) విభాగంలో ప్యూన్గా ఉద్యోగం వచ్చింది. అక్కడ విద్యార్థులను చూస్తూ గడిపిన అతనికి.. తను కూడా ఇంకా చదువుకోవాలని అనిపించింది.
యూనివర్సిటీ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని 2009లో ‘అంబేద్కర్ థఆట్ అండ్ సోషల్ వర్క్’ విభాగంలోనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అక్కడితో ఆగడం అతనికి ఇష్టం లేదు. దీంతో మరో మూడేళ్లు కష్టపడి యూనివర్సిటీ అధికారులను ఒప్పించి 2013లో పీహెచ్డీ కోర్సులో చేరి నాలుగేళ్లలో దాన్ని కూడా పూర్తిచేశాడు. ఆ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఈటీ) కూడా క్లియర్ చేసి లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలు పెట్టాడు.
అలాంటప్పుడే 2020లో మరోసారి అదృష్టదేవత అతని తలుపు తట్టింది. బిహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ (బీఎస్యూఎస్సీ).. అతను పనిచేస్తున్న టీఎంబీయూలోనే నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. వాటికి మండల్ కూడా అప్లై చేశాడు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఫలితాల్లో.. అతను ప్యూన్గా పని చేసిన విభాగంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం దక్కింది.
తన అద్భుతమైన జర్నీ గురించి మాట్లాడిన కమల్ కిషోర్.. ‘పేదరికం, కుటుంబ కష్టాలు నా చదువుకు అడ్డురాకుండా చూసుకున్నా. ఉదయాన్నే క్లాసులకు వెళ్లి మధ్యాహ్నం ఉద్యోగం చేసేవాణ్ణి. తర్వాత రాత్రిపూట కూర్చొని న క్లాసులు రివైజ్ చేసుకునేవాడిని’ అని ధీమాగా చెప్పాడు. ఇప్పటి వరకు కమల్ కిషోర్ తండ్రి గోపాల్ రోడ్డుపక్కన ఒక చిన్న టీస్టాల్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడని సమాచారం. ఇప్పుడు కమల్కు మంచి ఉద్యోగం రావడంతో ఆ కుటుంబ ఆర్థిక కష్టాలు తీరతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.