దమ్మపేట రూరల్/సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జగ్గారం వైపు వెళ్తున్న పెద్ద పులి దృశ్యాలు మంగళవారం తెల్లవారుజామున సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు, అటవీ సిబ్బంది సమీప గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం పెనుబల్లి మండలంలో సంచరించిన పులి మంగళవారం దమ్మపేట మండలానికి చేరుకొన్నదని అటవీ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పులి కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.