టోక్యో : ఆరు నూరైనా ఒలింపిక్స్ నిర్వహించి తీరుతామని జపాన్ ప్రధాని గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎలా నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ వాయిదా వేసుకోవాలంటూ అక్కడి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోరుతుండగా.. వాయిదా కుదరదని ప్రధాని యోషిహిదే సుగా కుండబద్దలు కొట్టేశారు. దాంతో ఒలింపిక్స్ను విజయవంతం చేసేందుకు అక్కడి అధికారులు నడుం బిగించారు. మరోవైపు, భారత్, పాకిస్తాన్, నేపాల్లపై జపాన్ ప్రభుత్వం ప్రయాణ నిషేధం విధించింది. దాంతో ఈ దేశాల క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనేది సందేహంగా కనిపిస్తున్నది.
టోక్యో ఒలింపిక్స్కు మరో 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒలింపిక్, పారాలింపిక్స్ కోసం విదేశాల నుంచి వచ్చే అధికారుల సంఖ్యను 60 శాతం తగ్గించాలని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు టోర్నమెంట్లకు కలిపి దాదాపు 80 వేల మంది అధికారులు టోక్యో చేరుకోనున్నారు. ఒలింపిక్స్ జూలై 24 న, పారాలింపిక్ గేమ్స్ ఆగస్టు 24 న ప్రారంభమవుతాయి.
అథ్లెట్ల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని, 15 వేల మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొంటారని టోక్టో ఆర్గనైజర్స్ కమిటీ సీఈఓ తోషిరో ముటో తెలిపారు. కరోనా కారణంగా అధికారుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఒలింపిక్ క్రీడలను ఛాలేంజిగా తీసుకున్న జపాన్.. ఇప్పటికే టోక్యోతోపాటు క్రీడాకారులు ఉండే ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు మరో మూడు రీజియన్లను కూడా ఎమర్జెన్సీ కిందకు తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కరోనావైరస్ మహమ్మారి ఉధృతంగా కొనసాగుతున్నందున టోక్యో ఒలింపిక్స్ను సురక్షితంగా నిర్వహించడం అసాధ్యమని జపాన్ దవాఖాన వైద్యుల సంఘం హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త కరోనావైరస్తో పోరాడుతున్న ఈ సమయంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని ప్రభుత్వానికి సమర్పించిన ఒక ప్రకటనలో యూనియన్ తెలిపింది.
ఇలాఉండగా, జపాన్ శుక్రవారం నుంచి భారతదేశంతోపాటు నేపాల్, పాకిస్తాన్ దేశాలపై ప్రయాణ నిషేధం విధించింది. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందో నిర్ణయించలేదు. ఈ నిర్ణయం భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఇబ్బందులను మరింత పెంచింది. ఈసారి టోర్నమెంట్ కోసం 13 క్రీడల్లో పాల్గొనేందుకు 100 మందికి పైగా అథ్లెట్లను పంపడానికి ఐఓఏ సన్నాహాలు చేస్తున్నది. ఈ ప్రయాణ నిషేధం ఇలాగే కొనసాగితే, టోక్యో ఒలింపిక్స్కు సిద్ధం కావడానికి అథ్లెట్లు వీలైనంత త్వరగా మరో దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. మన దేశ అథ్లెట్లను జపాన్ రెడ్ లిస్టులో లేని ప్రదేశానికి నెల ముందుగా పంపుతామని, ఆ తర్వాత వారు సులువుగా టోక్యోకు వెళ్లేందుకు వీలు చిక్కుతుందని ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా వెల్లడించారు.
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..