న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రభావంతో ఒక్కసారిగా క్రూడాయిల్ ధర భగ్గుమంది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయిని దాటేసి 103.78 డాలర్ల గరిష్ఠానికి పెరిగింది. ఈ స్థాయికి క్రూడ్ పెరగడం ఏడేండ్లలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా జరిగే చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ వున్నందున, ఈ ఇంధన ధర తక్షణమే పెరిగింది. సంక్షోభం ముదిరినప్పటికీ, మన దేశానికి ముడి చమురు సరఫరాల్లో పెద్దగా ఇబ్బంది తలెత్తదని, అయితే ధర పెరుగుదల ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై క్రూడ్ పెరుగుదల భారం ప్రస్తుతానికి పడదు. ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంటుంది. అయితే మనం సౌదీ, ఇరాక్ తదితర మధ్యప్రాచ్య దేశాలు (63 శాతం), ఆఫ్రికా, ఉత్తర అమెరికాల నుంచే దిగుమతి చేసుకుంటున్నందున, దేశంలోకి చమురు సరఫరాలు సజావుగానే ఉంటాయని ప్రభుత్వాధికారి తెలిపారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరల్ని ఏదో ఒక సమయంలో పెంచకతప్పదని ఆయన హెచ్చరించారు. మన దేశీయ క్రూడ్ దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చేది 1 శాతమే. అలాగే ఆ దేశం నుంచి 2021లో భారత్కు 1.3 శాతం బొగ్గు , 25 లక్షల టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతయ్యింది.
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదని, అధికంగా ఉన్న క్రూడ్ ధర మాత్రం ఆందోళకరమని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెబినార్లో నాగేశ్వరన్ మాట్లాడుతూ ముడి చమురు ధర దీర్ఘకాలం గరిష్ఠస్థాయిలో కొనసాగితే భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కొవిడ్ కారణంగా అనిశ్చితమైన ఆర్థికాభివృద్ధి, అధిక ద్రవ్యోల్బణం మనకే పరిమితం కాదని, ధనిక దేశాలు సైతం ఏ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు.