Tragedy | బెంగళూరు: విద్యుత్ వైరు రోడ్డుపై తెగి పడింది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మరణించారు. (Bengaluru Woman, 9 Month old Daughter Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల సౌందర్య, తొమ్మిది నెలల కుమార్తె సువికాస్లియాతో కలిసి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు నుంచి బెంగళూరు చేరుకుంది. ఉదయం ఆరు గంటలకు వైట్ఫీల్డ్ ప్రాంతంలోని ఇంటికి నడిచి వెళ్తున్నది. అయితే విద్యుత్ వైర్ తెగి రోడ్డుపై పడి ఉంది. చీకటి వల్ల ఆ వైర్ను గమనించని సౌందర్య దానిపై కాలు వేసింది. దీంతో ఆమెతోపాటు చేతిలోని 9 నెలల బిడ్డ విద్యుదాఘాతంతో మరణించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డ మృతికి వారే కారణమని ఆరోపించారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుదాఘాతం వల్ల చనిపోయిన తల్లి, బిడ్డ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) అధికారులు, సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.