బెంగుళూరు: కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరు నగరం జల దిగ్భంధంలో ఉంది. ఇంకా ఆ నగరంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. జన జీవనం స్తంభించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ఇవాళ మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే బెంగుళూరుకు ఇలాంటి దుస్థితి వచ్చినట్లు ఆయన ఆరోపించారు. నీళ్లు నిలిచిపోవడానికి కారణం.. కాంగ్రెస్ పాలన సమయంలో పరిపాలన సరిగా జరగలేదన్నారు. సరసుల వద్ద, బఫర్ జోన్ల వద్ద .. ఎటుపడితే అటు పర్మిషన్లు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. వీధుల్లో నిలిచిపోయిన నీళ్లను తొలగించేందుకు 1500 కోట్లను రిలీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. అక్రమ కట్టడాలను తొలగించేందుకు కూడా 300 కోట్లు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో నీరు నిలవకుండా ఉండే రీతిలో చర్యలు చేపట్టనున్నట్లు బసవరాజ్ చెప్పారు.
బెంగుళూరులో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు అయినట్లు సీఎం బొమ్మై వెల్లడించారు. బెంగుళూరు మొత్తం సమస్యాత్మకంగా లేదని, కానీ రెండు జోన్లు పూర్తిగా నీట మునిగినట్లు తెలిపారు. మహాదేవ్పురలో సమస్య ఉందని, ఆ ప్రాంతంలో 69 ట్యాంక్లు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకున్నామని, మన ఆఫీసర్లు, ఇంజినీర్లు, వర్కర్లు, సహాయక బృందాలు 24 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పారు.
మాండ్యా జిల్లాలో వర్షపు నీటి వల్ల రెండు పంపింగ్ స్టేషన్లకు సమస్య ఏర్పడిందన్నారు. ఒక పంపు హౌజ్ నుంచి నీటి ప్రవాహం తగ్గిందని, అక్కడ సప్లయ్ పునరుద్దరించనున్నట్లు సీఎం తెలిపారు. మరో పంపు హౌజ్ను త్వరలో క్లియర్ చేయనున్నట్లు చెప్పారు. ట్యాంకర్లు, బోర్వెల్స్ ద్వారా నీటిని సరఫరా చేయనున్నామన్నారు.